పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప తగ్గుదల
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 28, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ధరలు కాస్త తగ్గాయి. అయితే ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్ను తగ్గించింది. వ్యాట్ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది. నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ పైన 0.05 పైసలు తగ్గింది. డీజిల్ పైన రూ.0.04 పైసలు తగ్గింది. తిరుపతిలో పెట్రోల్ రూ.1.20 పైసలు, డీజిల్ రూ.0.19 పైసలు తగ్గింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. WTI క్రూడ్ 86.86 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 88.31 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పైపైకి చేరుతున్నాయి. త్వరలో ఫెడ్ రేట్లు పెరగనున్నాయనే అంశం ప్రభావం చమురుపై కనిపిస్తోంది. అయితే ఉద్రిక్తతల కారణంగా ధరలు పెరుగుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.