పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే, కేంద్రం తగ్గింపుతో వాహనదారులకు ఊరట
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (ఆదివారం, మే 2022) 45వ రోజు స్థిరంగా ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో ధరలు మాత్రం వాహనదారులకు ఊరటను కల్పించాయి. గత దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది.
నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120 నుండి ఏకంగా రూ.109.66కు తగ్గింది. డీజిల్ ధర రూ.105.49 నుండి రూ.97.82కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.96.72, డీజిల్ రూ.96.67 నుండి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24, కోల్కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89, గురుగ్రామ్లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది.
దేశీయ చమురు రంగ సంస్థలు చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెంపును అమలు చేశాయి. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. అంతకుముందు నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వాహనదారులకు ఊరటను కల్పించింది.