Petrol, diesel prices today: స్థిరంగా పెట్రోల్ ధరలు, ఢిల్లీలో రూ.8 తగ్గింపు
పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు వారాలుగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు వరుసగా 28వ రోజు గురువారం(డిసెంబర్ 02) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. తాజాగా ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్ను తగ్గించింది. వ్యాట్ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దిగువకు వచ్చాయి. ఢిల్లీ (రూ.94.14), కోల్కతా (రూ.89.79), చెన్నై (రూ.91.43), భోపాల్ (రూ.90.87లలో డీజిల్ ధర రూ.100 లోపు ఉంది. కేంద్రం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ చత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.
అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.36, లీటర్ డీజిల్ రూ.96.45గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.103.97, డీజిల్ రూ.86.67, ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14గా ఉంది.
యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.
బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 11.55 శాతం తగ్గి 72.72 డాలర్లకు వచ్చింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 12.06 శాతం క్షీణించి 68.15 డాలర్లకు వచ్చింది. యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల ఆందోళన నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ధరలు భారీగా క్షీణించాయి.
అంతర్జాతీయంగా ధరలు తగ్గించడం వల్ల ఇప్పుడు భారత్లోను ఈ ధరలు మరింత తగ్గిస్తారా అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరికొద్ది రోజులు క్షీణిస్తేనే అది వర్తిస్తుందని అంటున్నారు. దేశీయ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ విధంగా నిర్ణయించబడుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో మరిన్ని రోజులు తగ్గితేనే ఇక్కడా తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో నవంబర్ 25వ తేదీ వరకు ధరలు గరిష్టాల వద్ద ఉన్నాయి. ధరలు గత రెండు రోజులుగా మాత్రమే పడిపోయాయి.