Petrol diesel prices: హైదరాబాద్లో రూ.112 దాటిన పెట్రోల్
రెండు రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (బుధవారం 27, అక్టోబర్) మళ్లీ పెరిగాయి. అంతకుముందు వరుసగా ఐదు రోజులు ధరలు పెరిగాయి. ఇంధన ధరలు ఐదురోజుల పాటు 35పైసల చొప్పున పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా కనిపించాయి. కరోనా సమయంలో భారీగా పెరుగుతూ గత రెండేళ్లలో ధరలు మూడొంతులు ఎగిశాయి. లీటర్ పెట్రోల్ పైన రెండు సంవత్సరాల్లో రూ.34కు పైన, లీటర్ డీజిల్ పైన రూ.30 పెరిగింది. ఈ రెండేళ్ల కాలంలో డొమెస్టిక్ పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ 46 శాతం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF లేదా జెట్ ఫ్యూయల్) కంటే ఇప్పుడు పెట్రోల్ 35 శాతం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు రూ.79,020గా ఉంది. అంటే లీటర్కు రూ.79కి కాస్త పైన ఉంది. కానీ లీటర్ పెట్రోల్ మాత్రం ఢిల్లీలో రూ.107 పైన ఉంది.
తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.94 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.112ని క్రాస్ చేసింది. ఈ అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.7 వరకు పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.94, లీటర్ డీజిల్ రూ.96.67గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.113.80గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.104.75గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.46, డీజిల్ రూ.99.78, చెన్నైలో పెట్రోల్ రూ.104.83, డీజిల్ రూ.100.92, హైదరాబాద్లో పెట్రోల్ రూ.112.27, డీజిల్ రూ.105.46గా ఉంది.
గత కొద్దికాలంగా ధరలు దాదాపు ప్రతిరోజు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్, తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది నెలలుగా పెరగలేదు. గత నెల నుండి పెరుగుతున్నాయి. అంతకుముందు పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. గత నెల రోజులుగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు అక్కడ పెరుగుతుండటంతో ఇక్కడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో చివరి నుండి పెరగడం ప్రారంభమైంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేయగా, డీజిల్ కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది.
వివిధ నగరాల్లో పెట్రోల్ ధర రూ.110 దాటింది. ముంబైలో రూ.113 దాటగా, హైదరాబాద్లో రూ.112 దాటింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటాలు అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. చమురు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 80 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల వద్ద ఉంది. 2018 అక్టోబర్ తర్వాత ఇది గరిష్టం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ ప్రభావం పలు ఉత్పత్తులపై పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. దీంతో రవాణా భారంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు బొగ్గు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగాలకు భారం కానుంది. ఈ భారం ప్రజలపై పడే అవకాశాలు ఉంటాయి. బొగ్గు, చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ద్రవ్యోల్భణం పైన మాత్రమే కాకుండా, వివిధ రంగాలపై ప్రభావం చూపనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీస్ అనలిస్ట్స్ చెబుతున్నారు. ఉదాహరణకు సిమెంట్ కంపెనీల రవాణా ఖర్చులు 40 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ధర పెరిగి, వినియోగదారుడికి భారమయ్యే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, తద్వారా వినియోగదారులపై భారంలేకుండా చూడాలని అనుకుంటోందని, కానీ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇటీవల అన్నారు.