భారీగా పెరిగి బ్యారెల్ 70 డాలర్లకు జంప్, 9 రోజులుగా పెరగని పెట్రోల్ ధరలు
చమురురంగ కంపెనీలు సోమవారం(మార్చి 8) పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 18 నెలల గరిష్టం 70 డాలర్లకు చేరుకున్నప్పటికీ దేశీయంగా మాత్రం చమురు ధరలు పెరగలేదు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91.17, డీజిల్ రూ.81.47గా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వరుసగా తొమ్మిదో రోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులేదు.
చివరిసారి గత నెలలో పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారి గత నెల ఫిబ్రవరి 27వ తేదీన పెరిగాయి. ఢిల్లీలో అప్పుడు పెట్రోల్ ధర 24 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ రూ.91.17, డీజిల్ రూ.81.47, ముంబైలో పెట్రోల్ రూ.97.57, డీజిల్ రూ.88.60కు పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. భారత్లో చమురు పైన అత్యధికంగా పన్నులు ఉంటాయి.
నెలలో ఎంత పెరిగిందంటే
ఫిబ్రవరి 9వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో 14 సార్లు పెరిగాయి. ఈ నెల రోజుల్లో పెట్రోల్ లీటర్కు రూ.4.22, డీజిల్కు ఢిల్లీలో రూ.4.34 పెరిగింది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు 26సార్లు పెరిగాయి. పెట్రోల్ రూ.7.46, డీజిల్ రూ.7.60 పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే.
జీఎస్టీ పరిధిలోకి వస్తేనే..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, ఈ చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.75కు దిగి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ట్యాక్స్లు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. అందుకే ప్రభుత్వాలు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు నాయకులు సుముఖంగా ఉండరని అంటున్నారు.