ఇంధన ధరల్లో మార్పులేదు: పెట్రోల్ దారిలో డీజిల్.. రూ.100 క్రాస్
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన అనంతరం, నేడు (జూన్ 13, ఆదివారం) స్థిరంగా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.30, లీటర్ డీజిల్ రూ.94.39గా ఉంది. నిన్న దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 27 పైసలు, లీటర్ డీజిల్ 23 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.12, లీటర్ డీజిల్ రూ.86.98గా ఉంది.
నిన్నటి వరకు వరుసగా రెండు రోజుల పాటు ధరలు పెరిగాయి. మొన్న పెట్రోల్ లీటర్ పైన 29 నుండి 31 పైసలు, డీజిల్ పైన 28 పైసలు పెరిగింది. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు ఇప్పటికి 24సార్లు పెరిగాయి. ఈ కాలంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ పైన దాదాపు రూ.6కు పైగా పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102 దాటింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.100 సమీపానికి చేరుకుంది. పెట్రోల్ రూ.94.82, డీజిల్ రూ.94.82గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.12, డీజిల్ లీటర్ రూ.86.98, ముంబైలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39, కోల్కతా నగరంలో పెట్రోల్ రూ.96.06, డీజిల్ రూ.89.83, చెన్నైలో పెట్రోల్ రూ.97.43, డీజిల్ రూ.91.64 ఉంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో రూ.107 పైకి చేరుకుంది. ఇక్కడ డీజిల్ ధర రూ.100.05గా ఉంది. దేశంలో ఇది అత్యధికం. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. నాటి నుండి 24సార్లు ధరలను సవరించాయి.