లీటర్ పెట్రోల్ రూ.113: వాహనదారులపై వాతలు మళ్లీ..మళ్లీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా మూడోరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వాహనదారులపై భారాన్ని మోపాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై అదనపు భారం పడుతూనే వస్తోంది. ఇదవరకు వరుసగా రెండు నెలల పాటు ఇంధన ధరలను పెంచినట్టే.. ఈ సారి కూడా అలాంటి చర్యలను తీసుకుంటాయనే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. దీనికి అనుగుణంగా చమురు కంపెనీలు నిర్ణయాలు, చర్యలు ఉంటోన్నాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసల మేర పెంపుదల కనిపించింది. ఇదే పెరుగుదల అన్ని ఆయిల్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.102.14 పైసలకు చేరింది. డీజిల్ 90.47 పైసలుగా నమోదైంది. తాజాగా పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను దాటింది. 110 రూపాయల మార్క్ను దాటిన నగరాల సంఖ్య ఇదివరకు చాలా పరిమితంగా ఉండేది. ఇప్పడు పరిస్థితి మారింది. పలు చోట్ల ఈ మార్క్ను దాటింది పెట్రోల్ ధర.
మధ్యప్రదేశ్లోని సివానీలో లీటర్ పెట్రోల్ ఒక్కింటికి రికార్డు స్థాయిలో రూ.113.28 పైసలు పలుకుతోంది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో రూ.113.01 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 108 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.108.19 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర 98.16. చెన్నైలో పెట్రోల్ రూ.99.80, డీజిల్ ధర రూ.95.02 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించిన విషయం తెలిసిందే. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే చెన్నైలోనే దాని ధర తక్కువగా ఉంటోంది.
కాగా- తాజా పెంపుతో కోల్కతలో పెట్రోల్ ధర రూ.102.77 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.93.57గా ఉంటోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.105.65, డీజిల్ రూ.95.98 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.99.20 పైసలు, డీజిల్ రూ.90.85 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.104.91 పైసలు, డీజిల్ రూ.96.72, చండీగఢ్లో పెట్రోల్ రూ.98.29, డీజిల్-90.17 పైసలు పలుకుతోంది. భోపాల్లో పెట్రోల్ రూ.110.59 పైసలు, డీజిల్ రూ.99.37 పైసలుగా రికార్డయింది.
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలేనూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.