ఢిల్లీలో సరికొత్త రికార్డుకు పెట్రోల్ ధరలు: తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే?
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. గురువారం చమురు రంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచాయి. నేడు పెట్రోల్ లీటర్ పైన 35 పైసలు పెరిగి రూ.86.65 కాగా, డీజీల్ ధర 35 పైసలు పెరిగి రూ.76.83కు చేరుకుంది. 2021 బడ్జెట్ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాక్ ఇస్తున్నాయి.
బడ్జెట్లో ఇంధనంపై అగ్రి సెస్ విధించిన అనంతరం పెట్రోల ధరలు చర్చనీయాంశంగా మారాయి. ధరలు పెరుగుతాయనే వాదనలపై స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అగ్రి సెస్ ప్రభావం కస్టమర్లపై పడదని చెప్పారు. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఈ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది.
బోల్డ్గా... నిర్మలమ్మ బడ్జెట్కు 10/10, చైనాను అధిగమిస్తాం: రాకేష్ ఝున్ఝున్వాలా
వివిధ నగరాల్లో ధరలు
ధరల పెరుగుదల అనంతరం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.67కు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ రూ.88.01, చెన్నైలో 89.13గా ఉంది. డీజిల్ ధరలు కోల్కతాలో రూ.80.42, చెన్నైలో రూ.82.04గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.86.65, డీజిల్ రూ.రూ.76.83కు పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ.90.10, డీజిల్ రూ.83.81, అమరావతిలో పెట్రోల్ రూ.92.78, డీజిల్ రూ.85.99గా ఉంది.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, అగ్రిసెస్ భారం
పెట్రోల్, డీజిల్ పైన బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో కస్టమర్లపై అగ్రి సెస్ విధించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, అగ్రిసెస్ భారం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల అదనపు భారంపడదని ఆర్థికమంత్రి తెలిపారు. బడ్జెట్లో పెట్రోల్ పైన రూ.2.50, డీజిల్ మీద రూ.4 చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించారు.
11వ సారి జంప్
దేశీయ చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(HPCL)లు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరుగంటలకు సవరిస్తాయి. 2021లో జనవరి 6న చమురురంగ ధరలు మొదటిసారి పెరిగాయి. 2021లో పెట్రోల్ ధరలు 11వ సారి పెరిగాయి. ఈ ఏడాది పెట్రోల్ ధరలు రూ.2.94, డీజిల్ ధరలు రూ.2.96 పెరిగింది.