Petrol, Diesel prices: 44 రోజుల్లో పెట్రోల్ రూ.6.26, డీజిల్ రూ.6.68 జంప్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 క్రాస్ చేశాయి. రాజస్థాన్లోని గంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర బుధవారం రూ.107.79, లీటర్ డీజిల్ ధర రూ.100.51గా ఉంది. గత 44 రోజుల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు 25సార్లు పెరిగాయి. దేశీయ చమురురంగ కంపెనీలు ఇంధన ధరలను నేడు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 13 పైసలు పెరిగింది.
తాజా పెరుగుదలతో ఈ 44 రోజుల కాలంలో... అంటే మే 4వ తేదీ నుండి పెట్రోల్ ధర లీటర్ పైన రూ.6.26, డీజిల్ లీటర్ పైన రూ.6.68 పెరిగింది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.66, లీటర్ డీజిల్ రూ.87.41కి పెరిగింది. బెంగళూరులో కూడా పెట్రోల్ రూ.100కు సమీపంలో ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.102.82, లీటర్ డీజిల్ రూ.94.84గా ఉంది.
ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, బాన్స్వాడా, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్మగ్లూరు, శివమొగ్గ, హైదరాబాద్, లెహ్ ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది.