ఇంధనం షాక్: జూన్ 7 నుండి పెట్రోల్, డీజిల్ రూ.10 పెరుగుదల
వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం విరామం ఇచ్చాయి. అయితే ఈ రోజు (సోమవారం, 29, జూన్) మళ్లీ పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. చమురు ధరలు నిన్న ఒక్కరోజు పెరగలేదు. మళ్లీ నేడు పెరిగాయి.
సంక్షోభంలో చమురు ఇండస్ట్రీ, క్రూడాయిల్ భద్రతపై చైనా వ్యూహం
ఎంత పెరిగిందంటే?
ధరల సమీక్షలో భాగంగా చమురు రంగ సంస్థలు ఈ రోజు లీటర్ పెట్రోల్ పైన 5 పైసలు, లీటర్ డీజల్ పైన 13 పైసలు పెంచాయి. దీంతో వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.80.43, డీజిల్ రూ.80.53, ముంబైలో పెట్రోల్ రూ.రూ.87.19, డీజిల్ రూ.78.83, చెన్నైలో పెట్రోల్ రూ.83.63, డీజిల్ రూ.77.72, హైదరాబాద్లో పెట్రోల్ రూ.83.49, డీజిల్ రూ.78.69, విజయవాడలో పెట్రోల్ రూ.84.15, డీజిల్ రూ.79.19గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.
అక్కడ రూ.90 దాటింది
21 రోజుల పాటు పెరిగిన చమురు ధరలు నిన్న స్థిరంగా ఉండి, నేడు పెరిగాయి. పెట్రోల్ ధర జూన్ 17న కూడా పెరగలేదు. కేవలం డీజిల్ ధర మాత్రమే పెరిగింది. వరుస పెరుగుదలతో పెట్రోల్ ధర మధ్యప్రదేశ్లోని బాల్ఘాట్లో లీటర్ రూ.90గా ఉంది. ఎక్కువ నగరాల్లో రూ.80ని దాటింది. ఏడు మేజర్ నగరాల్లో డీజిల్ ధర రూ.75ని క్రాస్ చేసింది.
జూన్ 7 నుండి ఎంత పెరిగిందంటే
ఢిల్లీలో గతంలో లీటర్ పెట్రోల్ ధర అక్టోబర్ 4, 2018న రూ.84 పలికింది. డీజిల్ ధర అక్టోబర్ 16న రూ.75.69 పలికింది. ఇప్పుడు డీజిల్ ఆ ధరను దాటింది. పెట్రోల్ ధర ఆ సమీపానికి చేరుకుంది. జూన్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు లీటర్ డీజిల్ పైన రూ.10.39, లీటర్ పెట్రోల్ పైన రూ.9.23 పెరిగింది.