ఒకరోజు గ్యాప్ తర్వాత మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మంగళవారం, జూన్ 22) మరోసారి పెరిగాయి. నిన్న ఒకరోజు ధరలు స్థిరంగా ఉన్న అనంతరం నేడు మళ్లీ పెరిగాయి. దీంతో సోమవారం రూ.97.22గా ఉన్న లీటర్ పెట్రోల్ రూ.97.50కి పెరిగింది. డీజిల్ ధరలు రూ.87.23 నుండి రూ.87.97కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు భారత్ పెట్రోలియం కార్పోరేషన్, ఎస్సార్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ ధరలను సవరిస్తాయి.
తాజా పెరుగుదలతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.103.63, లీటర్ డీజిల్ రూ.95.72గా ఉంది. తమిళనాడు, చెన్నైలలో లీటర్ పెట్రోల్ రూ.98.65, లీటర్ డీజిల్ రూ.92.83గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.97.38, లీటర్ డీజిల్ రూ.91.08గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం పన్నుతో పాటు ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.
మే 4వ తేదీ నుండి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 28సార్లు పెరిగాయి. కేవలం మే నెలలోనే 17సార్లు పెరిగింది. మే 4వ తేదీ నుండి ఈ 49 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.7కు పైగా పెరిగింది. డీజిల్ పైన రూ.7.50కు పైగా పెరిగింది. ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, ఇడోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, చిక్మగ్ళూరు, శివమొగ్గ, లెహ్ తదితర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.