18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు 18 రోజుల తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మే 4, 2021 మంగళవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.15 పైసలు పెరిగి రూ.90.40 నుండి రూ.90.55కు, లీటర్ డీజిల్ 18 పైసలు పెరిగి రూ.80.73 నుండి రూ.80.91కు పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.95, డీజిల్ రూ.87.98, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.55, లీటర్ డీజిల్ రూ.85.90, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.76, లీటర్ డీజిల్ రూ.83.78గా ఉంది.
ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదయింది. చివరిసారి గత నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పద్దెనిమిది రోజుల విరామం తర్వాత రేట్లను సమీక్షించాయి భారత చమురురంగ కంపెనీలు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు ధరలు పెరగడం గమనార్హం.
పెట్రోల్, డీజిల్ ధరలు 66 రోజుల తర్వాత పెరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన పెరిగాయి. ఈ మధ్యకాలంలో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరలు తగ్గలేదనే అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల ముందు అయిదు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఇంధన ధరలను తగ్గించాయి చమురు సంస్థలు.