Petrol Rate: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 21, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 77 రోజులు ధరల్లో మార్పులేదు. రెండు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్ను తగ్గించింది. వ్యాట్ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.
యెమెన్ హుతి గ్రూప్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన బాంబు దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ అలైన్డ్ గ్రూప్-సౌదీ అరేబియన్ నేతృత్వంలోని సంకీర్ణాల మధ్య ఆగ్రహజ్వాలల ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటుంది. కొత్త క్యాలెండర్ ఏడాదిలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇటీవలే భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 86.21 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 86.90 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఇలాగే స్థిరంగా పెరిగితే మన వద్ద ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.