స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: చైనా ఎఫెక్ట్, అక్కడ భారీగా తగ్గిన ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 15వ రోజు శుక్రవారం(నవంబర్ 19) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి.
కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాల వ్యాట్ తగ్గింపు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 వరకు తగ్గింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.
అంతర్జాతీయంగా నిన్న చమురు ధరలు క్షీణించాయి. చమురు సరఫరా సులభతరమవుతుందనే అంచనాల నేపథ్యంలో ధరలు క్షీణించాయి. దీనికి తోడు చైనా కూడా క్రూడ్ రిజర్వ్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో చమురు ధరలు అంతర్జాతీయంగా ఓ సమయంల ఆరు వారాల కనిష్టానికి చేరాయి. అయితే ఆ తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ నిన్న 96 సెంట్లు లేదా 1.2 శాతం క్షీణించి 81.24 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నటి ట్రేడింగ్లో ఓ సమయంలో 79.28 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ 7వ తేదీ తర్వాత ఇదే కనిష్టం. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 65 సెంట్లు లేదా 0.8 శాతం క్షీణించి 79.01 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెస్ట్ టెక్సాస్ కూడా ఓ సమయంలో గత నెలరోజుల కనిష్టం 77.08 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది.