Petrol diesel prices: జెట్ ఫ్యూయల్ కంటే పెట్రోల్ ధర 30% అధికం
వరుసగా షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం (అక్టోబర్ 18) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి వరకు వరుసగా నాలుగో ఆదివారం ధరలు పెరిగాయి. నిన్న లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 35 పైసల వరకు పెరిగింది. ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.106కు చేరువ కాగా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రూ.110కి చేరువైంది. ఈ అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.4 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.84, లీటర్ డీజిల్ రూ.94.57గా ఉంది.
తాజా సవరణ అనంతరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.77గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.102.52గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.43, డీజిల్ రూ.97.68, చెన్నైలో పెట్రోల్ రూ.103.01, డీజిల్ రూ.98.92, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.109.53, డీజిల్ రూ.100.37, హైదరాబాద్లో పెట్రోల్ రూ.110.09, డీజిల్ రూ.103.08గా ఉంది.
వాహన ఇంధన ధరలు ఎయిర్లైన్స్లో ఉపయోగించే ఏటీఎఫ్ కంటే ప్రస్తుతం 30 శాతం అధికంగా ఉన్నాయి. ఢిల్లీలో ఏటీఎఫ్ లీటర్కు రూ.79 లేదా కిలో లీటర్కు రూ.79,020.16గా ఉంది. ఢిల్లీలో అదే లీటర్ పెట్రోల్ ధర రూ.106 వద్ద ఉంది. అంటే ఏటీఎఫ్ కంటే పెట్రోల్ 30 శాతం అధికంగా ఉంది. రాజస్థాన్లోని గంగానగర్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.117.86 వద్ద ఉంది. లీటర్ డీజిల్ రూ.105.95 వద్ద ఉంది.
గత మూడు వారాల్లో పెట్రోల్ ధరలు పక్షం రోజులకు పైగా పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్, తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది నెలలుగా పెరగలేదు. గత నెల నుండి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు రెండు నెలల తర్వాత ఇటీవల పెరిగాయి. అంతకుముందు పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు అక్కడ పెరుగుతుండటంతో ఇక్కడా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో చివరి నుండి పెరగడం ప్రారంభమైంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేయగా, డీజిల్ కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్, చెన్నై తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటాలు అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. చమురు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 80 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల వద్ద ఉంది. 2018 అక్టోబర్ తర్వాత ఇది గరిష్టం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ ప్రభావం పలు ఉత్పత్తులపై పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. దీంతో రవాణా భారంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు బొగ్గు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగాలకు భారం కానుంది.
ఈ భారం ప్రజలపై పడే అవకాశాలు ఉంటాయి. బొగ్గు, చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ద్రవ్యోల్భణం పైన మాత్రమే కాకుండా, వివిధ రంగాలపై ప్రభావం చూపనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీస్ అనలిస్ట్స్ చెబుతున్నారు. ఉదాహరణకు సిమెంట్ కంపెనీల రవాణా ఖర్చులు 40 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ధర పెరిగి, వినియోగదారుడికి భారమయ్యే అవకాశముంది.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, తద్వారా వినియోగదారులపై భారంలేకుండా చూడాలని అనుకుంటోందని, కానీ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇటీవల అన్నారు. 'మీరు(మోడీ ప్రభుత్వం) పెట్రోల్ ధరలు తగ్గించాలని భావిస్తున్నారా అంటే, నేను అవును అంటాను.
పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు అని అడిగితే మాత్రం రాష్ట్రాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకే తగ్గడం లేదు' అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కేంద్రానికి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.32 ఎక్సైజ్ డ్యూటీ వస్తోందని, ఇందులో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పన్ను ద్వారా వచ్చే రూ.32తో ఉచిత రేషన్, ఉచిత హౌసింగ్, ఉజ్వల వంటి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నామన్నారు.