ఇంధన ధరలు మళ్లీ జూమ్: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.116 పైమాటే
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వాటి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు మొహమాటానికి పోవట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఇవ్వాళ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అసలే కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. ఒకేసారి లీటర్ ఒక్కింటికి 35 పైసలు పెంచడం అంటే మాటలు కాదు. రికార్డుస్థాయి పెరుగుదల ఇది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 115 రూపాయలను దాటింది. డీజిల్ సైతం వంద రూపాయల మార్క్ను దాటేసింది. 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది రెండోసారి.
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.49 పైసలకు చేరింది. డీజిల్ 94.22 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.111.43 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర వంద రూపాయలను దాటింది. రూ.102.15 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.102.70 పైసలు, డీజిల్ ధర రూ.98.59 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్ను దాటింది.
కాగా- తాజా పెంపుతో కోల్కతలో పెట్రోల్ ధర రూ.106.10 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.97.33 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.109.16, డీజిల్ రూ.100.00 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.102.15 పైసలు, డీజిల్ రూ.94.31 పైసలకు చేరింది. భోపాల్లో పెట్రోల్ రూ.114.09 పైసలు, డీజిల్-103.40 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.108.84 పైసలు, డీజిల్ రూ.100.79 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.73 పైసలు, డీజిల్ రూ.102.80 పైసలు పలుకుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55 పైసలు, డీజిల్ ధర రూ.103.99 పైసలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 116.44 పైసలకు చేరింది. డీజిల్ రేటు 105.59 పైసలు.
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలానూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.