Petrol prices: 28వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఇరవై ఎనిమిదో రోజు (ఆగస్ట్ 14, శనివారం) స్థిరంగా ఉన్నాయి. నెల రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు మాత్రం జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే నేడు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి (గత నెలలో) లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ఇప్పటి వరకు ఒక్కసారీ పెరగలేదు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదల లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.76గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ క్రూడాయిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వంటి అంశాల కారణంగా కాస్త పైకి చేరుకున్నాయి. నిన్న బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్ల పైకి చేరుకున్నాయి. మిడ్-ఈస్ట్లో టెన్షన్స్ నేపథ్యంలో చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. అయితే ఆ తర్వాత చమురు డిమాండ్ ఆందోళనల ప్రభావంతో చమురు ధరలు క్షీణించాయి. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్కు 70 డాలర్లకు చేరుకుంది. బ్లాక్ గోల్డ్గా పేర్కొనే క్రూడ్ 5, 100, 200 రోజుల గరిష్టానికి, 20, 50 రోజుల గరిష్టం వద్ద ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం వద్ద ఉన్నాయని బ్రిటన్కు చెందిన RAC ఇటీవల పేర్కొంది. లీటర్ పెట్రోల్ సగటున 135.13 పౌండ్స్ వద్ద ఉంది. సెప్టెంబర్ 2013 తర్వాత ఇదే గరిష్టం. డీజిల్ సగటున 137.06 పౌండ్స్ వద్ద ఉంది. 2014 నుండి ఇదే గరిష్టమని పేర్కొంది.
ఇదిలా ఉండగా, పెట్రోల్పై విధించిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్పై వసూలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీలో రూ.3 తగ్గించనున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీ త్యాగరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో పెట్రోల్పై మూడు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించనున్నట్లు తెలిపారు.