Petrol, diesel prices: వరుసగా 5వరోజు స్థిరంగా ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం(ఆగస్ట్ 29) స్థిరంగా ఉన్నాయి. 5 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ పైన 15 పైసలు, లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గింది. నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు గత ఆదివారం తగ్గాయి. సోమవారం తిరిగి స్థిరంగా ఉండగా, మంగళవారం స్వల్పంగా తగ్గి, బుధవారం తిరిగి స్థిరంగా ఉన్నాయి. డీజిల్ ధరలు ఇటీవల పలుమార్లు తగ్గాయి. 35 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర గత ఆదివారం 15 పైసల నుండి 20 పైసలు తగ్గింది. ఇటీవల పలుమార్లు తగ్గిన డీజిల్ ధరలు గత ఆదివారం 18 పైసల నుండి 20 పైసల మధ్య తగ్గింది. ఇటీవలి వరకు నెల రోజులకు పైగా ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి జూలై నెలలో లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ధరలు ఇప్పటి వరకు పెరగలేదు. పైగా డీజిల్ ధరలు ఐదుసార్లు, పెట్రోల్ ధర రెండుసార్లు తగ్గింది. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49, లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.52, డీజిల్ రూ.96.48గా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.54, లీటర్ డీజిల్ రూ.96.99గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల తగ్గిన క్రూడాయిల్ ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం, చైనాలో డిమాండ్ ఔట్ లుక్ క్షీణత నేపథ్యంలో చమురు ధరలు ఏడు శాతం వరకు తగ్గాయి. గతవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువకు చేరుకొని, 66 డాలర్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధర 62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 71 డాలర్లకు చేరుకుంది. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 68 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.