వాహనదారులకు రిలీఫ్ దక్కిందా? లేదా?: పెట్రోల్, డీజిల్ రేట్లిలా..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా మూడో రోజు కూడా మార్పు చోటు చేసుకోలేదు. చమురు కంపెనీలు వాటి రేట్లను పెంచలేదు. బుధవారం నాటి రేట్లే మూడో రోజు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ- కొద్దిరోజులుగా వరుసగా భారీగా పెరుగుతూ వస్తోన్న ధరల వల్ల పెట్రోల్ రేటు అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు కొద్దిరోజులుగా పెంచుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కిందటి నెలలో ఈ పెరుగుదల ఆరంభమైంది. లీటర్పై సగటున ప్రతీరోజూ 80 పైసల మేర భారం పడుతూ వచ్చింది. ఫలితంగా లీటర్పై 10 రూపాయల మేర అదనపు భారాన్ని వాహనదారులు భరించే పరిస్థితి ఏర్పడింది. ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తన పంథానూ మార్చుకోలేదు.
17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ దరలు నిలకడగా ఉన్నందున ఈ రెండు రోజులూ ఇంధన రేట్లను సవరించలేదు చమురు కంపెనీలు. బుధవారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతున్నాయి. దీని ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది.
కోల్కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్గావ్లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు. అదే సమయంలో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. గృహావసర వినియోగదారులను సైతం వదల్లేదు. కమర్షియల్ సిలిండర్లపైనా భారం మోపింది.
బ్రెంట్ క్రూడ్లో బ్యారెల్ ధర 102.80 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ట్రేడ్లో ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. బ్యారెల్ ధర 98.26 వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల క్రూడాయిల్ షిప్పింగ్పై ప్రభావం పడింది. దీనికితోడు చైనాలో కొత్తగా కోవిడ్ 19 అవుట్ బ్రేక్ కావడం మరింత దెబ్బతీసింది. ఒపెక్ దేశాల నుంచి భారత్ 80 శాతం మేర చమురును దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే.