Petrol Price Today: అమెరికా సహా ఆ దేశాల్లో 50% పెరిగిన పెట్రోల్, భారత్లో 5 శాతమే
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 112 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో 30 డాలర్లకు పైగా పెరగడంతో మన వద్ద ఫలితాల తర్వాతనైనా ధరలు పెరుగవచ్చునని వార్తలు వచ్చాయి. కానీ ధరలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిన కారణంగా తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభకు తెలిపారు. రష్యా నుండి డిస్కౌంట్కు వస్తుందని భారత్ భావిస్తోంది. అలాగే, వెనిజులా, ఇరాన్ నుండి దిగుమతులు తిరిగి కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ దేశాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు 50 శాతం నుండి 58 శాతం వరకు పెరిగాయి. కానీ మన దేశంలో ఈ పెరుగుదల దాదాపు 5 శాతం మాత్రమే ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 15, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అతి తక్కువగా దొరుకుతుంది పోర్ట్ బ్లెయిర్లో. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది.
మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా, పలు ఇతర దేశాల్లో ఈ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగాయి. అక్కడి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ రూ.207కు చేరుకుంది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 98 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 102 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఇటీవల పైపైకి చేరుకున్నాయి. ఇటీవల చర్చల నేపథ్యంలో 130 డాలర్లకు చేరుకున్న క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్ పైన ప్రభావం చూపుతుంది. ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 నుండి రూ.20 పెరిగే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ అంతర్జాతీయంగా ధరలు ఊగిసలాటలో ఉండటంతో ధరల్లో మార్పులేదు.