9 శాతం లాభపడిన పేటీఎం స్టాక్, నాలుగు నెలల తర్వాత భారీ లాభం
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర నేడు భారీగా లాభపడింది. ఈ రోజు (మార్చి 24, గురువారం) ఓ సమయంలో ఏకంగా 13 శాతం ఎగిసిపడింది. గత నాలుగు నెలల కాలంలో ఇది గరిష్ట పెరుగుదల. పేటీఎం స్టాక్ దాదాపు 9 శాతం లాభపడి రూ.571 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో రూ.524 వద్ద ముగిసింది. నేడు నష్టాల్లోనే రూ.522 వద్ద ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత అంతకంతకూ ఎగిసిపడింది. ఇలా మధ్యాహ్నం రెండుసార్లు రూ.590ని దాటింది. ఓ సమయంలో 13 శాతం ఎగబాకి రూ.595ను కూడా తాకింది.
అయితే ఆ తర్వాత క్షీణించింప్పటికీ 9 శాతం లాభంతోనే ఉంది. పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37.06 వేల కోట్లను తాకింది. అయితే పేమెంట్ క్యూఆర్ కోడ్ ఆగ్రిగేటర్ పేటీఎం షేర్ భారీగా పతనమైంది. షేరు ఒడిదుడుకులపై సంస్థను బీఎస్ఈ వివరణ కోరింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని స్టాక్ ఎక్సేంజ్ ఆదేశించింది.
ఇందుకు స్పందనగా తమ బిజినెస్ ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉన్నాయని, సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీ షేరును ప్రభావితం చేసే సమాచారాన్ని ఎక్సేంజీలకు ఎప్పటికి అప్పుడు పంపిస్తున్నట్లు పేటీఎం వివరణ ఇచ్చింది.
నిన్న వివరణ తర్వాత కూడా షేర్ పతనం ఆగలేదు. ఈ షేర్ ధర రూ.524 వద్ద ముగిసింది. నాలుగు నెలల కాలంలో ఈ స్టాక్ రూ.4 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. అయితే నిన్న వివరణ తర్వాత నేడు స్వల్పంగా పెరగడం ఊరట.
ఇక నేడు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా నష్టపోయాయి. నేడు ఆద్యంతం ఊగిసలాటలో ఉన్నాయి. చివరకు సెన్సెక్స్ 89 పాయింట్లు నష్టపోయి 57,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 17,222 పాయింట్ల వద్ద ముగిసింది.