ఆర్బీఐ ఆంక్షల ఎఫెక్ట్, పేటీఎం స్టాక్స్ లిస్టింగ్ రోజు రూ.2000 నుండి రూ.680కి పతనం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పైన ఆంక్షలు విధించడంతో ఈ స్టాక్ దారుణంగా పతనమైంది. నేడు (సోమవారం మార్చి 14) పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ స్టాక్ 12 శాతానికి పైగా నష్టపోయింది. ఓ సమయంలో దాదాపు 13 శాతం క్షీణించింది. కొత్త ఖాతాలు తెరవడం నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును కేంద్ర బ్యాంకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం కంపెనీ షేర్ల వ్యాల్యూ పతనమైంది.
పేటీఎం షేరు నేడు రూ.661.50 స్థాయికి పతనమై, ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ఈ స్టాక్ ఇప్పటి వరకు 70 శాతం వరకు క్షీణించింది. పేటీఎం స్టాక్ నేడు రూ.675 వద్ద ప్రారంభమై, రూ.719 వద్ద గరిష్టాన్ని, రూ.661.50 వద్ద కనిష్టాన్ని తాకింది. పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44 వేలకోట్లకు క్షీణించింది. ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం లిస్ట్ అయిన రోజు రూ.1955. కనిష్టం నేటి రూ.661.5. పేటీఎం ఇష్యూ ధర రూ.2150. ఇన్వెస్టర్లు దాదాపు 70 శాతం నష్టపోయినట్లే. మధ్యాహ్నం గం.3.35 సమయానికి పేటీఎం స్టాక్ 12.21 శాతం లేదా రూ.95 క్షీణించి రూ.680 వద్ద ట్రేడ్ అవుతోంది.
బ్యాంకులో కొన్ని పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకున్నది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని 35ఏ సెక్షన్ కింద, కొత్త ఖాతాలు తెరవడాన్ని తక్షణమే నిలిపివేయాలని పేటీఎంను ఆదేశించినట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం ఐటీ వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు, ఒక ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. 2016 ఆగస్ట్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటయింది. 2017 మేలో నోయిడాలో శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆర్బీఐ ఆంక్షలను పేటీఎం ఎదుర్కోవడం ఇది మూడోసారి. కొత్త ఖాతాలకు నో చెప్పడం రెండోసారి.