రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. బోరున ఏడుస్తున్న ఇన్వెస్టర్లు.. నిండా ముంచి ఐపీవో..
Stock Market Losses: గత సంవత్సరం వచ్చిన ఐపీవోలు ఇన్వెస్టర్లకు ఒకపెద్ద పీడకల అని చెప్పుకోవాలి. అవి వారిని ఎంతలా ముంచాయంటే కేవలం ఒక్క కంపెనీ మాత్రమే ఏకంగా రూ.8 లక్షల కోట్ల సంపదను మిందేసింది. కళ్ల ముందే కోట్లు కరిగిపోవటంతో ఇప్పుడు ఇన్వెస్టర్లు స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అలా ఇన్వెస్టర్ల ఆశలను ఆవిరిచేసిన కొన్ని ఐపీవోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిండా ముంచాయి..
కొత్తతరం కంపెనీల విస్తరణ వేగాన్ని చూసి సామాన్యులే కాదు ఇన్వెస్టర్లు సైతం మోసపోయారా అని అనిపిస్తోంది ఈ స్టాక్స్ పనితీరు గమనిస్తే. అవును ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది జొమాటో, నైకా, డెలివరీ, పాలసీబజార్ వంటి టెక్ కంపెనీల గురించే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీటిలో కేవలం ఏడాది కాలంలోనే నమ్మి ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
పేటీఎం దుస్థితి..
మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే కోట్లలో నష్టాలను నమోదు చేస్తున్న కంపెనీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా లాభాల్లోకి మాత్రం రాకపోవటం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ విలువ మార్కెట్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ రోజు సైతం స్టాక్ దాదాపు 4.7 శాతం నష్టపోయి రూ.454 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో స్టాక్ రికార్డు కనిష్ఠ స్థాయిలకు చేరుకుంటోంది.
రిలయన్స్ ముప్పు..
ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ మ్యాక్విన్ జియో ఫైనాన్స్ వ్యాపారం పేటీఎంకు అవరోధంగా మారుతుందని హెచ్చరించటంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం పేటీఎం స్టాక్ లిస్టింగ్ ధర కంటే 70 శాతం తక్కువకు పడిపోయింది. దీంతో అసలు ఈ షేర్లను ఏం చేయాలి అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. నిన్న ఏకంగా రికార్డు స్థాయిలో ట్రేడింగ్ సమయంలో స్టాక్ ఏకంగా 11 శాతం వరకు క్రాష్ అయ్యింది. లాక్ ఇన్ పిరియడ్ ముగియటంతో పెద్ద ఇన్వెస్టర్లు సైతం షేర్లను విక్రయిస్తున్నారు.
జొమాటో-డెలివరీ పరిస్థితి..
జొమాటో షేర్ల విషయానికి వస్తే.. ఇందులో పెట్టుబడులు పెట్టిన ఉబెర్ ఆగస్టులో తన వాటాలను విక్రయించింది. అలాగే డెలివరీ లాక్-ఇన్ పీరియడ్ సోమవారం ముగిసింది. దీంతో CA స్విఫ్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్లైన్ లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్ డెలివరీలో సగం వాటాను ఒక్కో షేరు సగటు ధర రూ.330.02కి విక్రయించినట్లు ఎన్ఎస్ఈ డేటా ప్రాకారం వెల్లడైంది. ఏదేమైనా ఇన్వెస్టర్లు మాత్రం తమ విలువైన పెట్టుబడులను ఐపీవోల్లో పెట్టుబడిగా పెట్టి నష్టాలను మూటకట్టుకున్నారు.