Paytm విజయం మెుదలైంది.. స్పీడ్ పెంచుతామన్న విజయ్ శేఖర్ శర్మ..!
Paytm: దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పేటీఎం షేర్ల విషయంలో లాభాల కంటే నష్టాలను చవిచూశారు. వరుసగా అనేక త్రైమాసికాలుగా నష్టాలను చవిచూస్తున్న Paytm స్థిరమైన క్షీణతను మాత్రమే చూస్తోంది. గత సంవత్సరం నవంబర్ లో ఐపీవోగా మార్కెట్లోకి రూ.2080-2150 ధరకు స్టాక్ ఇష్యూ అయ్యింది.
ప్రస్తుతం స్టాక్ పరిస్థితి..
ఈ రోజు పేటీఎం షేర్లు స్వల్పంగా నష్టపోయి మధ్యాహ్నం 12.12 గంటలకు రూ.629.65 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఈ స్టాక్ నిన్ని ఎన్ఎస్ఈలో 1.04 శాతం పెరిగి రూ.638.55 వద్ద ముగిసింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,955 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ రూ.510.05గా ఉంది.
స్టాక్ హిస్టరీ..
ఈ ఏడాది ఇప్పటి వరకు షేరు ధర 52.17% క్షీణించింది. గత 3 నెలల్లో 18.87% క్షీణించగా.. ఒక నెల కాలంలో 6.27% క్షీణతను చూసింది. ఇదిలా ఉండగా కంపెనీ పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉందని పేటీఎం ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. కంపెనీకి ప్రస్తుతం తగినంత నగదు నిల్వలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
శర్మ ఉత్సాహం..
కంపెనీ లాభదాయకత, స్కేలబిలిటీ, ఆర్థిక సేవల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిందని శర్మ అన్నారు. దీనిపై తాను ఉత్సాహంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఇటీవలి త్రైమాసికాల్లో స్థిరంగా బలమైన ఆపరేటింగ్ పరపతి, EBITA నష్టాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు లాభదాయకమైన కంపెనీగా అవతరించే దశకు చేరుకుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కంపెనీ ప్రయాణం సానుకూలంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
తగ్గుతున్న నష్టాలు..
Paytm గత వారం తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇందులో తన ఏకీకృత నికర నష్టాన్ని రూ.571 కోట్లుగా వెల్లడించింది. జూన్ త్రైమాసికంలోనూ రూ.644.4 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ ఆదాయం గతేడాది కంటే 76% పెరిగి రూ.1914 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో నష్టాలు క్రమంగా తగ్గించుకుండూ కంపెనీ లాభాల్లోకి వెళుతోంది.
ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం..
పేటీఎం క్రెడిట్ మార్కెట్లో మంచి అభివృద్ధి జరుగుతోందని.. దాని భవిష్యత్తుపై తనకు నమ్మకం ఉందని శర్మ వెల్లడించారు. డిజిటలైజేషన్ వేగం పుంజుకోవటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా ఉంది. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్న కంపెనీ నష్టాలు అనేక మంది ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. రానున్న కాలంలో కంపెనీ లాభాల బాట పడుతుందని పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. తదనుగుణంగా కంపెనీ తన కార్యకలాపాలను నిరంతరం మెరుగుపరుస్తోందని శర్మ చెప్పారు.