చిల్లర దుకాణాలే ఇక ఏటీఎంలు! ‘పేనియర్బై’ మాస్టర్ ప్లాన్...
దేశంలో నోట్ల రద్దు జరిగినప్పట్నించి నేటి వరకు నగదు కోసం ప్రజలు నానా తంటాలు పడుతూనే ఉన్నారు. అప్పట్లో ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా 'నో మనీ' బోర్డు దర్శనమిచ్చేది. ఆ తర్వాత బ్యాంకులు కూడా చాలావరకు ఎటీఎంలను తగ్గించి వేశాయి. ఇప్పుడు కూడా అత్యవసరమై నగదు కోసం సమీపంలోని ఏటీఎం వద్దకు పరిగెడితే.. అందులో నోట్లు ఉంటే వస్తాయి.. లేకుంటే మిమ్మల్ని వెక్కిరిస్తూ.. చిన్న స్లిప్ ఒకటి బయటికొస్తుంది.
అయితే ఇలాంటి అనుభవాలు జనాన్ని మటుకు బాగానే ఎడ్యుకేట్ చేశాయి. అందుకే ఇప్పుడు చదువు రాని వాళ్లు సైతం ఏటీఎం కంటే పేటీఎం బెటర్ అనే పొజీషన్కి వచ్చేశారు. ఎంత పేటీఎం, ఫ్రీచార్జ్, ఫోన్ పే ఉన్నా.. ఒక్కోసారి జనానికి నగదు అత్యవసరం అవుతుంది. ఏదో సరదాగా ఇంటి పక్కనే ఉన్న చిన్న దుకాణానికి వెళ్లి.. ఓ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ కొన్ని దమ్ములాగినంత సులువుగా.. చేతిలోకి నగదు వచ్చి పడితే బాగుణ్ణు కదూ.. అనిపిస్తుంటుంది.
సరిగ్గా ఈ ఆలోచనే ఓ కొత్త తరం ఫిన్టెక్ కంపెనీ 'పేనియర్బై'కి కూడా వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం.. దానిని ఆ కంపెనీ అమలులో కూడా పెట్టేసింది. సోమవారం ఈ కంపెనీ తన సొంత మైక్రో ఏటీఎం మెషిన్ను ఆవిష్కరించింది. అది కూడా ఓ రిటైల్ షాపులో. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం!
ఇక మీదట మీ ఇంటిపక్కన ఉండే రిటైల్ షాపులే మీకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులిచ్చే మైక్రో ఏటీఎంలుగా మారనున్నాయి. ఎందుకంటే రాబోయే ఏడాది కాలంలో దేశవాప్తంగా ఇలాంటి లక్ష మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని 'పేనియర్బై' కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
దేశంలోని అన్ని బ్యాంకులు తమ ఎటీఎంల సంఖ్యను చాలావరకు తగ్గించుకున్నాయి. అదేమంటే.. సాఫ్ట్వేర్ మెయింటినెన్స్ వ్యయం, ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ వ్యయం పెరిగాయంటూ ఏవేవో కారణాలు వల్లెవేస్తాయి. ఇలా దేశంలోని 50 శాతం ఏటీఎంలు మూతపడనున్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీస్(క్యాట్మి) కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మైక్రో ఏటీఎంలు పుట్టుకొస్తున్నాయి.
ఇకమీదట రిటైల్ షాపుల వారు కూడా డెబిట్ కార్డులపై నగదు విత్డ్రా చేసుకునే వీలు కల్పిస్తారని పేనియర్బై తెలిపింది. రోజు వారీగా నగదు లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారస్తుల దుకాణాలలోనే ఈ మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నామని, పీఓఎస్ ఆధారిత మైక్రో ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ వ్యయం కూడా తక్కువేనని పేనియర్బై సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ వెల్లడించారు.
తమకున్న 7.5 లక్షల రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి 50 లక్షల రిటైలర్లను తాము ఏర్పాటు చేసుకోనున్నామని, అదేవిధంగా తొలి ఏడాదిలోనే లక్ష పీఓఎస్ ఆధారిత మైక్రో ఏటీఎంలనూ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వివరించారు.