Bank Account: తండ్రికొడుకుల బ్యాంకు ఖాతాల్లో రూ.1518 కోట్లు జమ అయ్యాయి
ఓ వృద్ధుడు తన వృద్దాప్య పింఛన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. అతను తన పింఛన్ డబ్బులు తీసుకున్నాడు. ఎందుకైన మంచిది తన ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే ఇంకా ఎన్ని డబ్బులు తన ఖాతాలో ఉందని అడిగాడు. దీంతో సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేశారు. అందులో ఉన్న బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లు ఉన్నాయి. అలాగే ఆ వృద్ధుడి కొడుకు ఖాతాలో రూ.759 కోట్ల జమ అయ్యాయి. ఇందుకు సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు.
బీహార్ లోని ముజఫర్పుర్కు చెందిన 82ఏళ్ల కామేశ్వర్ మిశ్రాకు పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆదివారం పింఛన్ డబ్బులు తీసుకుందామని అనుకున్నాడు. అయితే ఆదివారం కావడంతో బ్యాంక్ కు సెలవు ఉంది. దీంతో మిశ్రా దగ్గరలో తెరిచి ఉన్న కామన్ సర్వీస్ సెంటర్(CSC)కి వెళ్లాడు. తనకు పింఛన్ వచ్చిందని డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చినట్లు అతను చెప్పాడు. దీంతో కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు మిశ్రా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి థంబ్ తీసుకుని పింఛన్ డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మిశ్ర తన ఖాతాలో ఇంకా ఎంత డబ్బు ఉందని అడిగాడు.

అప్పుడు సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేశారు. కామేశ్వర్ మిశ్రా ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అలాగే కామేశ్వర్ మిశ్రా కొడుకు ఖాతా కూడా తనిఖీ చేశారు. దివ్యాంగుడైన అతని ఖాతాలో కూడా రూ.759 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.1518 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ డబ్బుల గురించి కామేశ్వర్ మిశ్రా, అతని కొడుకును అడగ్గా.. తమకు తెలియదని చెప్పారు. దీంతో కామన్ సర్వీస్ సెంటర్ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
కాగా బ్యాంక్ అధికారులు కామేశ్వర్ మిశ్రా, అతని కుమారుడి బ్యాంక్ ఖాతాను స్తంభింప చేశారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొంతమంది ఖాతాల్లో రూ. కోట్లు జమ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాంక్ అధికారులు ఆ డబ్బును తిరిగి తీసుకున్నారు. అయితే డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసి వాడేస్తే.. ఆ డబ్బులను బ్యాంకు వారు తిరిగి స్వాధీనం చేసుకుంటారు.


Click it and Unblock the Notifications