టుడే యువర్ లాస్ట్ వర్కింగ్ డే.. పొద్దున్నే ఆరు గంటలకు ఒరాకిల్ ఉద్యోగులకు మెయిల్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్న దిగ్గజ టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle), తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇస్తూ తాజా ఉద్యోగ తొలగింపులను చేపట్టింది. తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ఉద్యోగులకు పంపిన ఇమెయిల్లో 'విస్తృత సంస్థాగత మార్పు'లో భాగంగా వారికే తుది పనిదినమని పేర్కొంటూ యాజమాన్యం తీసివేత ప్రకటన చేసింది.
ఈ సందేశం అందిన కొద్ది సమయంలోనే ఉద్యోగుల మెయిల్స్, వాయిస్మెయిల్, కంపెనీ ఫైళ్లకు సంబంధించిన ప్రాప్యత (Access) తక్షణమే నిలిపివేయబడింది. ఈ విడతలో బాధితుల సంఖ్యను ఒరాకిల్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. కంపెనీ పాటిస్తున్న ఈ ఆకస్మిక ధోరణి సిబ్బందిని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఒరాకిల్ మూలధన వ్యయం మునుపటి కంటే మూడు రెట్లు పెరిగి $28.5 బిలియన్లకు చేరడం, ఏడాది మొత్తం క్యాపెక్స్ అంచనా $90-95 బిలియన్లుగా ఉండటం, $5.4 బిలియన్ల ప్రతికూల నగదు ప్రవాహం ఏర్పడటంతో, వ్యయ నియంత్రణ కొరకు కంపెనీ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

ఒరాకిల్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలోనే తమ మొత్తం శ్రామిక శక్తిలో 13 శాతం అంటే దాదాపు 21,000 ఉద్యోగాలను తొలగించింది. మే నెలాఖరు నాటికి 1,41,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా, పునర్నిర్మాణ కార్యక్రమం కోసం కంపెనీ వెచ్చిస్తున్న అంచనా వ్యయం $2.8 బిలియన్లకు చేరుకుంది. అయితే ఈ ప్రతికూల వాతావరణం కేవలం ఒరాకిల్కే పరిమితం కాకుండా మొత్తం టెక్నాలజీ రంగంలో విస్తరించింది.
లాఫ్స్.ఎఫ్ వై (Layoffs.fyi) గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్ మొదటి పది రోజుల్లోనే ఉబెర్, పేపాల్, ఆపిల్, జొమాటో వంటి సంస్థలలో 6,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు పోగా, ఈ ఏడాది ఇప్పటివరకు 299 కంపెనీలలో 1,28,536 మంది టెక్ కార్మికులు వీధిపాలయ్యారు. ఏఐ ప్రభావం విస్తరిస్తే అమెరికాలోని 6 నుండి 7 శాతం ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్ రంగాలలో ప్రమాదంలో పడవచ్చని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేయగా, ఏఐ ధాటికి 22 నుండి 25 ఏళ్ల వయస్సు గల యువ కార్మికులు తీవ్రంగా వెనుకబడిపోతున్నారని స్టాన్ఫోర్డ్ డిజిటల్ ఎకనామిక్ ల్యాబ్ అధ్యయనం పేర్కొంది.
ఈ పరిణామాలపై స్పందించిన విశ్లేషకులు.. ప్రస్తుత పరిస్థితిని కేవలం ఏఐ యంత్రాలు మానవ ఉద్యోగాలను ఆక్రమించడంగా మాత్రమే చూడలేమని అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తమ శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐ విప్లవాన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. అయితే, కేవలం ఉద్యోగులను తొలగించి వ్యయ పొదుపుకే పరిమితమయ్యే సంస్థల కంటే, ఏఐ ఉత్పాదకత ద్వారా వచ్చే ప్రయోజనాలను తిరిగి ఉద్యోగుల శిక్షణ, ఆవిష్కరణలలో పెట్టుబడిగా పెట్టే కంపెనీలే 2027 నాటికి దీర్ఘకాలిక విజయం సాధిస్తాయని గార్ట్నర్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. స్వల్పకాలిక వ్యయ కోతలు నాణ్యత, రిస్క్ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, కార్మికులను మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే కంపెనీల భవిష్యత్తుకు శ్రీరామరక్ష కానుంది.


Click it and Unblock the Notifications

