హార్ముజ్ జలసంధి సమీపంలో పడవలో మంటలు..భారతీయుడు మృతి, మరో నలుగురికి గాయాలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణ సరుకులతో ప్రయాణిస్తున్న ఒక భారతీయ చెక్క పడవ (ధో)లో అగ్నిప్రమాదం సంభవించి.. అది సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.
వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన Strait of Hormuz జలమార్గం వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పడవకు నిప్పంటుకుని సముద్రంలో మునిగిపోతున్న తరుణంలో, అటుగా వెళ్తున్న మరో నౌక అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. అందులోని సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను కాపాడారు. దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం దుబాయ్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రమాదం జరిగిన వెంటనే భారత ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. దుబాయ్లోని భారత కాన్సులర్ అధికారులు బాధితులను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించారు. పడవ యజమానితో సంప్రదింపులు జరుపుతూ.. సిబ్బందికి కావలసిన వైద్య సదుపాయాలు, ఇతర న్యాయపరమైన సాయం అందేలా చూస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
మరోవైపు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ నౌకల భద్రతపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నిరంతరం పర్యవేక్షిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్తో జరిపిన దౌత్యపరమైన చర్చలు సఫలమవడంతో ఇప్పటివరకు 11 భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా బయటకు వచ్చాయి. అయితే, ఇంకా 13 నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకొని ఉన్నాయి. వాటిని కూడా క్షేమంగా భారతదేశానికి తీసుకువచ్చేందుకు భారత అధికారులు ఇరాన్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
అదే సమయంలో, అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి ఇరాన్ నౌకలు భారత ప్రాదేశిక జలాలను ఉపయోగిస్తున్నాయన్న వార్తలపై జైస్వాల్ స్పందించారు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించడానికి ఏ దేశ నౌకకైనా ప్రత్యేక అనుమతి అవసరం లేదని, అయితే భారత జలాల్లోకి ప్రవేశించే అంశం సాంకేతికపరమైనదని ఆయన వివరించారు. దీనిపై నౌకా రవాణా మంత్రిత్వ శాఖ తగిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఏదేమైనా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల, నౌకల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యతని భారత ప్రభుత్వం చాటిచెబుతోంది. ఈ విషాద ఘటన నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే ఇతర భారతీయ నౌకలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications
