2000 Notes: నేటి నుంచి రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి.. ఈ విషయాలు తెలుసుకోండి..
2000 Notes: గతవారం స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత రిజర్వు బ్యాంక్ 2000 నోట్ల ఉపసంహరణపై కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను తీసుకొచ్చిన లక్ష్యం పూర్తైందంటూ గవర్నర్ శక్తి కాంతదాస్ సైతం వెల్లడించారు.
భారతీయ రిజర్వు బ్యాంక్ సర్క్యులర్ ప్రకారం దేశంలోని ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను సమీప బ్యాంక్ బ్రాంచ్ ద్వారా మార్చుకోవచ్చు. నోట్ల మార్పిడికి సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఉన్నందున ఎలాంటి హడావిడి అవసరం లేదని లిక్విడిటీ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు దాస్ దేశ ప్రజలకు మీడియా ముఖంగా తెలిపారు.
మే 23, 2023 నుంచి బ్యాంక్ వద్ద నోట్లను మార్చుకునేందుకు కొన్ని సూచనలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. వీటి ప్రకారం ఎలాంటి రుజువులు లేకుండా ఒక వ్యక్తి రోజుకు గరిష్ఠంగా 20,000 రూపాయల వరకు నోట్లను మార్చుకోవచ్చు. అలాగే ఎవరైనా రూ.50,000 మంచి ట్రాన్సాక్షన్ రూ.2000 నోట్లతో చేస్తున్నట్లయితే అందుకు తమ పాన్కార్డ్ వివరాలను తప్పక అందించాల్సి ఉంటుంది.
రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవటం వల్ల చాలా మంది వాటికి పెట్రోల్ బంకుల్లో మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో చాలా చోట్ల వాటిని అంగీకరించటం లేదు. ఇదే క్రమంలో చాలా మంది బంగారం, వెండి కొనుగోలుకు ఈ రూ.2000 నోట్లను వినియోగిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. మరికొందరు రియల్టీ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు రెండు వేల నోట్లను వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రూ.2000 నోట్ల ఉపసంహరణ గతంలో చేపట్టిన పెద్దనోట్ల రద్దుకు లాజికల్ ఫాలోఅప్ అని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ అన్నారు. రూ.2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని దెబ్బతీస్తుందని మరియు వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన వెల్లడించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ అనేది RSS ఆర్థిక అనుబంధ సంస్థ. ఇది బీజేపీకి దాని అగ్ర నాయకులకు నిబద్ధత గల కేడర్ను అందిస్తుంది.