Ola EV: అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్.. మార్కెట్లో దూకుకెళ్లేందుకు ప్లాన్ ఫిక్స్.. సీఈవో ఏమన్నారంటే..
Ola EV: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 2022లో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. తన వాహనాలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే ప్రణాళికపై కంపెనీ ప్రస్తుతం పరిశీలిస్తోంది. రానున్న రెండేళ్లలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మాస్-మార్కెట్ స్కూటర్, ప్రీమియం మోటార్సైకిల్, మాస్ మోటార్సైకిల్తో సహా మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ బ్లాగ్ పోస్ట్లో నిన్న వెల్లడించారు. ఈ ఏడాది 1,50,000 EVలను విక్రయించినట్లు అందులో వెల్లడించారు.

2025 చివరి నాటికి దేశంలో విక్రయించే అన్ని ద్విచక్రవాహనాలు ఎలక్ట్రిక్, 2030 నాటికి విక్రయించే అన్ని కార్లు ఎలక్ట్రిక్గా ఉంటాయని అగర్వాల్ పేర్కొన్నారు. 2024 చివరినాటికి కంపెనీ తన మెుదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. 2027 నాటికి కంపెనీ మెుత్తం ఆరు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానుందని స్పష్టం చేశారు.

ఓలా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాలను ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికాతో సహా అన్ని సంబంధిత మార్కెట్లకు భారత్ నుంచే ఎగుమతి చేయడాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు చైనా, తైవాన్, జపాన్, కొరియా నుంచి అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్ పై ఆధారపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా 2023 చివరి నాటికి కంపెనీ తన స్వంత లిథియం-అయాన్ సెల్ను ప్రారంభించనున్నట్లు అగర్వాల్ ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించారు.


Click it and Unblock the Notifications