ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు.. దాడులు, ప్రతిదాడులతో దద్దరిలిల్లిన హార్ముజ్.. భారత్ పరిస్థితి ఏంటి..
హార్ముజ్ జలసంధి సమీపంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు.. వాటికి ప్రతిస్పందనగా అమెరికా తీసుకున్న కఠినమైన సైనిక, ఆర్థిక చర్యల వల్ల మధ్యప్రాచ్యం (పశ్చిమ ఆసియా) మరోసారి తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లింది. తాత్కాలిక ఒప్పందం జరిగి 30 రోజులు గడువు కూడా కాకముందే పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులు ఈ ప్రాంతంలో కాల్పుల విరమణను పూర్తిగా దెబ్బతీశాయి.
ఖతార్ నుండి 29 మంది నావికులతో భారతదేశానికి ప్రయాణిస్తున్న ఒక నౌకపై ఒమన్ తీరంలో డ్రోన్ దాడి జరగడం.. అలాగే సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను పెంచింది. ఈ డ్రోన్ దాడిలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ పరిణామాలతో పూర్తిగా దెబ్బతింది.

శాంతి చర్చలు ముగిసిపోక ముందే, ఇరు దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులు ప్రారంభం కావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రత లోపించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ఒక్కసారిగా కల్లోలానికి గురైంది. జూలై 8, 2026 నాటికి బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్కు 75 డాలర్లను.. అలాగే డబ్ల్యూటీఐ (WTI) ధర 72 డాలర్లను దాటడం ఈ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ భయాలకు అద్దం పడుతోంది.
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడమేనని అమెరికా ఆరోపించింది. ఇందులో ఖతార్కు చెందిన ద్రవీకృత సహజ వాయువు (LNG) ట్యాంకర్ 'అల్-రెకయ్యత్'తో పాటు ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియా ముడిచమురు సూపర్ట్యాంకర్ 'వెద్యాన్' కూడా దెబ్బతిన్నాయి. ఈ నౌకల్లో ఒకటి ఖతార్ నుండి 29 మంది నావికులతో భారతదేశానికి ప్రయాణిస్తుండగా డ్రోన్ దాడికి గురైంది.
ఈ దాడిలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని తీవ్రంగా ఖండించింది. హెచ్చరికలను బేఖాతరు చేసినందుకే తాము స్పందించాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొన్నప్పటికీ.. టెహ్రాన్ ఈ దాడులకు నేరుగా బాధ్యత వహించలేదు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం, ఇరాన్ ప్రజలు అమెరికాపై ప్రతీకార శపథాలు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
ఇరాన్ దురాక్రమణను అడ్డుకోవడానికి, అంతర్జాతీయ జలమార్గాల్లో పౌర నౌకల రక్షణ కోసం యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్పై 'శక్తివంతమైన దాడుల పరంపర'ను ప్రారంభించాయి. అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ మీడియా ప్రకారం దక్షిణ ఓడరేవు పట్టణమైన సిరిక్, ఖేష్మ్ ద్వీపం మరియు బందర్ అబ్బాస్లలో భారీ పేలుళ్లు సంభవించాయి.
ఈ దాడులలో అక్కడి వాణిజ్య, చేపల రేవులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సైనిక చర్యలతో పాటు అమెరికా వైట్హౌస్, ట్రెజరీ శాఖ ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను తిరిగి విధించాయి. ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు విక్రయాల కోసం గతంలో ఇచ్చిన 60 రోజుల రాయితీలను (సాధారణ లైసెన్స్ను) రద్దు చేశాయి. పాత లావాదేవీలను ముగించుకోవడానికి జూలై 17 వరకు మాత్రమే గడువు ఇచ్చారు. ఒప్పందం కుదిరిన 30 రోజులు కాకముందే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడంపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాము తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించింది.
ఈ పశ్చిమ ఆసియా సంక్షోభం భారతదేశంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాలలో అత్యధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది, కాబట్టి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల దేశ ఇంధన దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ఇది దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలకు, తద్వారా ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడిపై భారం మోపుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ గనుక పూర్తిగా మూసివేస్తే.. ప్రపంచ సరఫరా గొలుసు స్తంభించిపోతుంది. గత సంక్షోభాల నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే భారతదేశ ఆర్థిక, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో, ఈ తాజా ఘర్షణలు భారత ఆర్థిక రికవరీకి, వ్యూహాత్మక ప్రయోజనాలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.


Click it and Unblock the Notifications
