చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు 1.6%, రూ.500 నోట్లు 35 శాతం
2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకు వచ్చారు. అయితే క్రమంగా రూ.2000 నోట్లను కూడా చలామణి నుండి తగ్గిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆర్బీఐ రూ.2 వేల నోట్లను చలామణి నుండి వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.దీనిి తోడు ముద్రణ నిలిపివేసింది. ఈ రెండు మార్గాల ద్వారా చలామణిని తగ్గిస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గింది. దేశంలో చలామణిలోని మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిణామం కేవలం 1.6 శాతం. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది.
2021 మార్చి చివరి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గింది. 2021 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం 2 శాతం. 2022 మార్చి నాటికి ఇది 1.6 శాతం తగ్గింది. మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.2వేల నోట్ల వ్యాల్యూ 17.3 శాతం నుండి 13.8 శాతానికి తగ్గినట్లు తెలిపింది.
ఇక రూ.500 నోట్ల చలామణి పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2021 మార్చి నాటికి 3,867.90 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ సంఖ్య రూ.4554.68 కోట్లకు పెరిగింది. దేశంలో చలామణిలోని మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం ఏకంగా 34.9 శాతం. ఆ తర్వాత 21.3 శాతంతో రూ.10 నోట్లు ఉన్నాయి. మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.500 నోట్ల విలువ 73.3 శాతం. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు కాగా, వాటి వ్యాల్యూ రూ.31.05 లక్షల కోట్లు.