Rice Exports Ban: ప్రపంచంలో అత్యధిక బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ మెుదటి స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పెరుగుతున్న బియ్యం ధరలను అరికట్టేందుకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.
ఈ నిర్ణయం అనేక దేశాలను ఆందోళనలోకి నెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బియ్యం ధరలు వేగంగా పెరుగుతాయని భయాలు మెుదలయ్యాయి. ఇదే క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సైతం దీనివల్ల ప్రభావితం అవుతున్నారు. దీంతో అనేక మంది ఎక్కువ సంఖ్యలో ప్రధాన ఆహారమైన బియ్యం కొనుగోలు చేసేందుకు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు.

భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎగుమతులు నిలిచిపోతాయని.. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని అమెరికాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్లోసరీ స్టోర్లలో ఒక్కొక్కరు 10 నుంచి 15 సంచులను కొనుగోలు చేస్తున్నారు. స్టోర్లలో షెల్ఫ్ పైకి ఎక్కి బియ్యం సంచులను దింపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే చాలా మంది బియ్యం కొనుగోలు చేసేందుకు స్టోర్ల బయట బారులు తీరారు.
కొంత మంది అతితెలివైన వారు 100 నుంచి 200 కిలోల బాస్మతీ బియ్యం కొనుగోలు చేసి స్టాక్ పెట్టారని, వీరిలో కొందరు వాటిని ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్ లో తిరిగి అమ్ముతున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బెనిన్ భారత్ నుంచి బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో ఒకటిగా ఉంది. ఇదే క్రమంలో మనదేశం నుంచి అధికంగా నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కోట్ డి ఐవోయిర్, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటి, మడగాస్కర్, కామెరూన్ సోమాలియా, మలేషియా, లైబీరియా, UAEలు తెల్ల బియ్యం దిగుమతి చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications