NPA: మొండిబకాయిల పదేళ్ల రికార్డు బ్రేక్.. తీవ్ర సంక్షోభంలోనూ ఇండియన్ బ్యాంక్స్ పనితీరు భేష్
NPA: జాతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వాటి ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడటంలో మొండి బకాయిల(NPA) నిర్వహణ ఎంతో కీలకం. వాటిపై తాజాగా RBI నివేదిక విడుదల చేసింది.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నికర నిరర్థక ఆస్తులు (NPA)లు భారీగా తగ్గినట్లు తన ఆర్థిక స్థిరత్వ నివేదిక(FSR)లో రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. మార్చి 2023లో NPA నిష్పత్తి 10 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. మార్చి 2018లో అత్యధికంగా 11.5 శాతం, 6.1 శాతంగా ఉన్న స్థూల, నికర NPA నిష్పత్తి.. మార్చి 2023 నాటికి వరుసగా 3.9 శాతం, 1.0 శాతానికి తగ్గడం శుభపరిణామంగా పేర్కొంది.

గత FSR నివేదిక విడుదల చేసినప్పటి నుంచి దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో భారీ మార్పులు జరిగాయి. అయితే వాటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని, భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల సహకారంతో ఈ నివేదికను 6 నెలలకొకసారి సెంట్రల్ బ్యాంకు విడుదల చేస్తుంది.

'మార్చి 2023లో US, యూరప్ లో ఏర్పడిన బ్యాంకింగ్ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ఒత్తిడికి గురైంది. కానీ భారత ఆర్థిక రంగం మాత్రం స్థిరంగా ఉంది. బ్యాంక్ క్రెడిట్ లో స్థిరమైన వృద్ధి, తక్కువ NPAలు, తగిన మూలధనం మరియు లిక్విడిటీ కలిగి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది' అని RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications


