జీఎస్టీ హిస్టరీలోనే రెండో హయ్యెస్ట్, నవంబర్లో రూ.1.31 లక్షల కోట్లు వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డును సృష్టించాయి. వరుసగా ఐదో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జూలై నెలలో జీఎస్టీని అమలులోకి తెచ్చిన తర్వాత ఇది రెండో గరిష్టం. నవంబర్ నెలలో రూ.1,31,526 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం తెలిపింది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.23,978 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.31,127 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ రూ.66,815 కోట్లుగా నమోదయింది. దిగుమతులపై వసూలు చేసిన రూ.32,165 కోట్లతో కలిసి సమ్మిళిత జీఎస్టీ రూ.66,815 కోట్లుగా నమోదైంది. సెస్ రూపంలో రూ.9606 కోట్లు వచ్చాయి. ఇందులో రూ.653 కోట్లు వస్తు దిగుమతులపై వచ్చాయి.
గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 25 శాతం, 2019లో ఇదే నెలతో పోలిస్తే 27 శాతం పెరిగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనేందుకు ఇది నిదర్శనమని ఆర్థిక శాఖ పేర్కొంది. అక్టోబర్ 2021లో జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లు. 2021 ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.
జీఎస్టీ వసూళ్లు ఇలా...
2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో రూ.1.41 లక్షల కోట్లు, మే నెలలో రూ.97,821 కోట్లు, జూన్లో రూ.92,800 కోట్లు, జూలైలో రూ.1.16 లక్షల కోట్లు, ఆగస్ట్లో రూ.1.12 లక్షల కోట్లు, సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్లు, అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్లు, నవంబర్లో రూ.1.31 లక్షల కోట్లు నమోదయ్యాయి.