క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తేల్చి చెప్పిన ఆనంద్ మహీంద్రా
భారత బిలియనీర్ ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై స్వయానా సదరు బిలియనీర్ స్పందించారు. తాను ఎలాంటి క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. తాను క్రిప్టోలో ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని కుండబద్దలు కొట్టారు.
క్రిప్టో కరెన్సీలో ఆనంద్ మహీంద్రా పెట్టుబడి పెట్టారని, అలాగే వీటి ద్వారా వేగంగా డబ్బులు ఎలా సంపాదించాలో సలహాలు కూడా ఇచ్చారని కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఓ మీడియా కథనాన్ని షేర్ చేస్తూ, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు.
'ఇది చాలా అనైతికమైనది, ప్రమాదకరమైనది కాకపోతే వినోదభరితంగా ఉండేది. దీనిని కొందరు ఆన్లైన్లో గుర్తించి నన్ను అప్రమత్తం చేశారు. అయితే ఇది పూర్తిగా కల్పితం, మోసపూరితమైన వార్త. నకిలీ వార్తల ప్రచారంలో కొత్త పంథా. వాస్తవానికి క్రిప్టోల్లో నేను ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు' అని తేల్చి చెప్పారు.