Gautam Adani: అదానీకి ఆ రాష్ట్రాల్లో పిచ్చ క్రేజ్.. ఇన్వెస్ట్ చేయాలంటూ రెడ్ కార్పెట్..బీజేపీ మాయేనా..?
Gautam Adani: ప్రస్తుతం అదానీ గాలి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరటంతోనే భారత్ లో ఆయన విస్తరణ ఎంత స్పీడ్ గా జరుగుతుందో చాలా మందికి అర్థమైంది. అదేంటో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే బుల్లెట్ బండిలాగా దూసుకుపోతున్న అదానీ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మనం తప్పక తెలుసుకోవాల్సిందే.
BJP అధికారంలో..
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీ అధికారంలోలేని అనేక రాష్ట్రాలు అదానీకి భ్రమ్మరథం పడుతున్నాయి. ఆ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు బిలియనీర్ అదానీకి తమ రాష్ట్రాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు బ్రూమ్ బెర్గ్ క్వింట్ ప్రైమ్ నివేదించింది.
ఆశ్చర్యం కలిగిస్తూ..
బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తరచుగా అదానీని విపక్షంలోని అనేక పార్టీలు విమర్శించటం మనం చూస్తూనే ఉంటాం. వినటానికి ఈ విషయం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికీ అలాంటి కొన్ని రాష్ట్రాల్లో అదానీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో గ్రూప్ పెట్టుబడులకు ఇది అదనం.
రానున్న కాలంలో..
అదానీ గ్రూప్ ఇటీవలే రాజస్థాన్లో రాబోయే 5-7 సంవత్సరాల్లో అదనంగా రూ.65,000 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. ఈ భారీ పెట్టుబడితో 10,000 మెగావాట్ల మెగా పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ కు సంబంధించిన ప్లాంట్ విస్తరణ, జైపూర్ విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేయడం వంటి వాటిని ప్రకటించింది.
స్టీల్ బిజినెస్ కోసం..
ఆగస్టులో అదానీ గ్రూప్ ఒడిశాలోని బాక్సైట్ గనులు, ఇనుప ఖనిజం విలువ జోడింపు ప్రాజెక్టుల సమీపంలో ఇంటిగ్రేటెడ్ అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి రూ. 58,585 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రానున్న 10 ఏళ్లలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, సముద్రగర్భ కేబుల్స్ వ్యాపారాలకు రూ.10,000 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో..
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంపెనీలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. అయితే అదానీ తన పెట్టుబడులను పూర్తిగా వెనక్కి తీసుకోకుండా కొంత భాగాన్ని మాత్రం తగ్గించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అదానీ రూ.60,000 కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించింది. ఈ మెుత్తంతో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో సోలార్ ప్లాంట్తో పాటు 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇదంతా ఆ రాష్ట్రాలను బీజేపీ గ్రిప్ లో పెట్టుకునేందుకేనా అనే అనుమానాలు సేతం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.