మూడోసారి అదృష్టం కలిసొస్తుందా.. టాటా సన్స్ చైర్మన్ పీఠంపై నోయెల్ టాటా పేరు మళ్లీ తెరపైకి..
భారతీయ వ్యాపార రంగానికి దిశానిర్దేశం చేసే టాటా సామ్రాజ్యంలో ఒకప్పుడు ప్రచారానికి దూరంగా.. తెరవెనుక కీలక పాత్ర పోషించిన నోయెల్ టాటా, నేడు అత్యంత ప్రభావవంతమైన స్థానానికి చేరుకున్నారు. ఒకప్పుడు టాటా సన్స్ ఛైర్మన్ పదవికి రెండుసార్లు పరిశీలనకు వచ్చి దూరమైన ఆయన.. ఇప్పుడు గ్రూప్ తదుపరి ఛైర్మన్ ఎవరనేది నిర్ణయించడంతో పాటు, బహుళ బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ భవిష్యత్ దిశను నిర్దేశించే ప్రధాన కేంద్రబిందువుగా అవతరించారు.
2012లో రతన్ టాటా రిటైర్మెంట్ సమయంలో నోయెల్ పేరు ఛైర్మన్ రేసులో విపరీతంగా వినిపించినప్పటికీ.. బోర్డు ఊహించని రీతిలో సైరస్ మిస్త్రీని ఎంచుకుంది. ఆ తర్వాత 2016లో సైరస్ మిస్త్రీని నాటకీయ పరిణామాల మధ్య తొలిగించినప్పుడు.. తాత్కాలిక ఛైర్మన్గా రతన్ టాటా తిరిగి వచ్చారు. ఆ తరుణంలోనూ నోయెల్ పేరు మళ్లీ తెరపైకి వచ్చినప్పటికీ, చివరికి టీసీఎస్ అధిపతి ఎన్. చంద్రశేఖరన్ వైపు మొగ్గు చూపారు. అలా రెండుసార్లు అగ్రపదవి చేజారినప్పటికీ.. నోయెల్ నిరాశ చెందకుండా తన కార్పొరేట్ ప్రయాణాన్ని నిశ్శబ్దంగా కొనసాగించారు.

నోయెల్ టాటా శైలి రతన్ టాటా లాగా పబ్లిక్ ప్రదర్శనలు, భారీ ప్రకటనలకు వేదిక కాలేదు. ఆయన ఎప్పుడూ ఫలితాలకే ప్రాధాన్యతనిచ్చారు. 1999లో టాటా గ్రూప్ రిటైల్ విభాగం 'ట్రెంట్' (Trent) బాధ్యతలు స్వీకరించిన నోయెల్, 'వెస్ట్సైడ్' బ్రాండ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. అనంతరం అతితక్కువ సమయంలోనే అత్యంత విజయవంతమైన రీటైల్ విప్లవంగా మారిన 'జూడియో' (Zudio) విస్తరణ వెనుక ఆయన నిశ్శబ్ద వ్యూహాలే ఉన్నాయి. అలాగే టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన హయాంలో కంపెనీ టర్నోవర్ $500 మిలియన్ల నుండి ఏకంగా $3 బిలియన్లకు పైగా పెరిగింది. వోల్టాస్, టాటా స్టీల్, టైటాన్ వంటి బోర్డుల్లో సుదీర్ఘ అనుభవం ఆయనకు వివిధ రంగాలపై పూర్తి పట్టు సాధించేలా చేసింది.
అయితే, 2024 అక్టోబర్లో రతన్ టాటా మరణం ఈ వ్యాపార కుటుంబ చరిత్రలోనే అతిపెద్ద మలుపుగా మారింది. రతన్ టాటా నిష్క్రమణ తర్వాత, టాటా సన్స్లో ఏకంగా 66 శాతం మెజారిటీ వాటా ఉన్న శక్తివంతమైన 'టాటా ట్రస్ట్స్' ఛైర్మన్గా నోయెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే అక్టోబర్ 2024లో ఆయన టాటా సన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు. ఒకప్పుడు హోల్డింగ్ కంపెనీకి ఛైర్మన్ రేసులో ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ఆ హోల్డింగ్ కంపెనీని శాసించే మెజారిటీ వాటాదారుల అధిపతిగా మారడం విశేషం.
ప్రస్తుత ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలం ముగింపునకు రానుండటంతో.. టాటా గ్రూప్కు తదుపరి నాయకుడిని ఎంచుకునే కీలక బాధ్యత నోయెల్ టాటా నేతృత్వంలోని బోర్డు మరియు టాటా ట్రస్ట్స్ చేతుల్లోనే ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా $180 బిలియన్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి, 10 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఈ అతిపెద్ద నెట్వర్క్ను ముందుండి నడిపించే వ్యక్తిని ఎంపిక చేయడమే కాకుండా, టాటా సన్స్ను పబ్లిక్ లిస్టింగ్ చేయాలా వద్దా అనే సున్నితమైన అంశాన్ని తేల్చడం నోయెల్ ముందున్న ప్రధాన సవాలు. దశాబ్దాలుగా ప్రచారానికి దూరంగా ఉంటూ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న నోయెల్ టాటా, ఇప్పుడు టాటా గ్రూప్ తదుపరి శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే సంరక్షకుడిగా నిలిచారు.


Click it and Unblock the Notifications
