అలాంటిదేమీ లేదు: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ, కేంద్రం కీలక ప్రకటన
కరోనా నేపథ్యంలో అందరికీ ఇన్సురెన్స్ పైన అవగాహన పెరిగింది. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ప్రజలు మక్కువతో ఉన్నారు. మరోవైపు, కరోనా దెబ్బతో క్లెయిమ్స్ కూడా పెరుగుతున్నాయి. దీంతో బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో హెల్తి ఇన్సురెన్స్ ప్రీమియం పైన జీఎస్టీ 18 శాతం చెల్లించవలసి వస్తోంది. దీంతో హెల్త్ ఇన్సురెన్స్ పైన జీఎస్టీ తగ్గించాలనే డిమాండ్ పెరిగింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది.
హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తగ్గించే యోచన లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎలాంటి సిఫార్సులు జీఎస్టీ మండలి పరిశీలనలో లేదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు అనుగుణంగా మాత్రమే జీఎస్టీ ఎంత ఉండాలనేది నిర్ణయించబడుతుందని, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటును తగ్గించే ఎలాంటి సిఫార్స్ ప్రస్తుతం జీఎస్టీ మండలి పరిశీలనలో లేదని లోకసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కారద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆరోగ్యబీమా పాలసీ ప్రీమియంపై అధిక జీఎస్టీ ఉండడం వల్ల పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాల, విశ్రాంత ఉద్యోగులు తక్కువ మొత్తం వైద్య బీమా పాలసీవైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. పాలసీపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించడం వల్ల ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో హెల్త్ పాలసీ ప్రీమియంపై జీఎస్టీ తగ్గించే యోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం తెలిపింది.