'అప్పటి వరకు జీఎస్టీ స్లాబ్స్, జీఎస్టీ రేట్లలో మార్పులుండవు'
రెవెన్యూ స్టెబిలైజ్ అయ్యే వరకు జీఎస్టీ స్లాబ్స్, రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదని చెప్పారు. ఆర్థిక మందగమనం నెలకొందని కాబట్టి జీఎస్టీని తగ్గించకపోతే పెంచడానికి కూడా అవకాశం లేదని స్పష్టం చేశారు.
మీకు షాప్ ఉందా? పెట్టుబడి లేకుండానే... అమెజాన్ సూపర్ ఆఫర్!!
ప్రస్తుతానికి రాష్ట్రాలు వ్యతిరేకం
ప్రస్తుతం పన్ను రేట్లు పెంచేందుకు ఏ రాష్ట్రం కూడా సిద్ధంగా లేదని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. జీఎస్టీ రేట్ల పెంపునకు రాష్ట్రాలు సుముఖంగా లేవన్నారు. 'భారత్: ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మార్గాలు' అనే నినాదంతో జరుగుతున్న ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. జీఎస్టీ నెలసరి వసూళ్ల క్షీణతకు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు కారణమని, ఆయా వస్తు, సేవలపై పన్ను తక్కువ కాదన్నారు.
అప్పటి దాకా మార్పుల్లేవు
అందుకే జీఎస్టీలో మార్పులకు ఇది సరైన సమయం కాదని మెజారిటీ రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. ఆదాయ స్థిరత్వం లభించేదాకా స్లాబ్స్, రేట్లలో మార్పులు ఉండవని అబిప్రాయపడ్డారు. రెవెన్యూ స్థిరత్వం లభించిన తర్వాత ట్యాక్స్ రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయని సుశీల్ కుమార్ మోడీ అన్నారు.
జీఎస్టీ మండలి
కాగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో స్లాబ్స్, పన్నురేట్లు మారుతాయని భావించారు. కానీ అలాంటివేమీ లేకుండానే సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మోడీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒకే దేశం... ఒకే పన్ను.. ఒకే మార్కెట్ పేరుతో 2017 జూలై 1న జీఎస్టీని దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ సర్కార్ అమలులోకి తెచ్చింది.