మనకు గ్యాస్ కష్టాలు తీరినట్లే.. హార్ముజ్ జలసంధితో పని లేకుండా సముద్రం అడుగున గ్యాస్ పైప్లైన్..
పశ్చిమ ఆసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య రేగుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' రవాణాను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంలో తరచూ తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన భద్రతకు పెద్ద సవాలుగా మారాయి.
ఈ అంతరాయాలను అధిగమించడానికి, ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయ ఇంధన మార్గాన్ని సృష్టించడానికి ఒమన్, భారతదేశం మధ్య 'సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్ప్రైజ్' (SAGE) అనే ప్రతిష్టాత్మక లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది. ఇది గనుక పూర్తిగా కార్యరూపం దాల్చితే భారత ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది.

సుమారు 5 బిలియన్ డాలర్ల (దాదాపు 41 వేల కోట్ల రూపాయల) భారీ అంచనా వ్యయంతో ప్రతిపాదించబడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద, అరేబియా సముద్రం అడుగుభాగం నుండి రెండు వేల కిలోమీటర్ల పొడవైన గ్యాస్ పైప్లైన్ను నిర్మిస్తారు. ఈ మార్గం ఒమన్లోని రాస్ అల్ జాఫండ్ తీరంలో ప్రారంభమై, సముద్ర గర్భం గుండా ప్రయాణిస్తూ నేరుగా గుజరాత్లోని ముంద్రా పోర్ట్ను అనుసంధానిస్తుంది.
ఈ గ్యాస్ పైప్లైన్ సముద్ర మట్టానికి ఏకంగా 3,400 మీటర్ల (3.4 కిలోమీటర్ల) లోతులో వెళుతుంది, దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన లోతైన సముద్ర పైప్లైన్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పైప్లైన్ ద్వారా భారతదేశానికి ప్రతిరోజూ 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు నిరంతరాయంగా సరఫరా చేయబడుతుంది.
ప్రస్తుతం భారతదేశం తన గ్యాస్ అవసరాల కోసం అత్యంత ఖరీదైన ఎల్ఎన్జీ నౌకల ద్వారా గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది. ఎల్ఎన్జీ దిగుమతులకు భిన్నంగా అంటే వాయువును ద్రవీకరించి, ట్యాంకర్ల ద్వారా రవాణా చేసి, చేరిన తర్వాత తిరిగి వాయువుగా మార్చే సంక్లిష్ట ప్రక్రియ లేకుండా ఈ పైప్లైన్లు సహజ వాయువును దాని మూలం నుండి నేరుగా గమ్యస్థానానికి ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. పైప్లైన్ల ద్వారా గ్యాస్ను సరఫరా చేయడం వల్ల ప్రతి mmBtuకు ( Million British Thermal Units-మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్లు) సుమారుగా 2 నుండి 3 డాలర్ల వరకు దిగుమతి ఖర్చులో గణనీయమైన ఆదా లభిస్తుంది, ఇది దేశ ఖజానాకు భారీ ఉపశమనాన్ని ఇస్తుంది.
భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ దిగుమతులలో గణనీయమైన భాగం గల్ఫ్ దేశాల నుండి వస్తుంది మరియు పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి చేరుతుంది. ఈ మార్గానికి ఏదైనా అంతరాయం కలిగితే, అది ప్రపంచ ఇంధన మార్కెట్పై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది, దీనివల్ల రవాణా ఖర్చులతో పాటు ఇంధన ధరలు పెరిగి సరఫరా గొలుసులు దెబ్బతింటాయి.
పశ్చిమ ఆసియాలోని ఇటీవలి ఉద్రిక్తతలు, కేవలం ఒకే సముద్ర మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేశాయి. వేగంగా మారుతున్న ఎల్ఎన్జీ ధరలు మరియు నౌకా రవాణా భద్రతపై ఉన్న ఆందోళనలు, అధిక సరఫరా స్థిరత్వాన్ని అందించే ప్రత్యామ్నాయాలపై ఆసక్తిని పునరుద్ధరించాయి. సముద్ర వాణిజ్య మార్గాలను ప్రభావితం చేసే అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
పర్లియావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా, 2030 నాటికి భారతదేశం తన మొత్తం ఇంధన వాటాలో సహజ వాయువు వాటాను ప్రస్తుతమున్న 6 శాతం నుండి 15 శాతానికి పెంచుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరల హెచ్చుతగ్గుల నుండి దేశాన్ని కాపాడుతూ, నిరంతర రవాణా భద్రతను కల్పిస్తూ భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఈ ఒమన్-భారత్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.


Click it and Unblock the Notifications
