గుడ్న్యూస్: బ్యాంకు సర్వీస్ ఛార్జీలు పెరగవు.. ఇప్పట్లో పెరగవు కూడా
ఏ ప్రభుత్వరంగ బ్యాంకు(PSU) కూడా సర్వీస్ ఛార్జీలు పెంచలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఒక నెలలో బ్యాంకు శాఖలో నగదు డిపాజిట్, ఉపసంహరణ ట్రాన్సాక్షన్స్ సంఖ్యకు సంబంధించి చేసిన మార్పులను కూడా వెనక్కి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు ఛార్జీలు పెంచబోవని తేల్చి చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన నేపథ్యంలో బ్యాంకు అకౌంట్ కలిగిన వారికి ఊరట దక్కనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను పెంచాయనే వార్తలను కేంద్రం తోసిపుచ్చింది.
కస్టమర్లకు ఐసీఐసీఐ ఝలక్, క్యాష్ డిపాజిట్పై కన్వీనియెన్స్ ఫీజు, వారికి ఊరట.
సర్వీస్ ఛార్జీలు పెంచలేదు
మనీ డిపాజిట్, మనీ విత్డ్రాకు సంబంధించి సేవలను నెలకు ఐదుసార్లు ఉచితంగా పొందే అవకాశం ఉందని, దానిని మూడుసార్లకు తగ్గిస్తూ BOB నిర్ణయం తీసుకుందని, నవంబర్ 1వ తేదీ నుండి ఈ సవరణ అమలులోకి వస్తున్నట్లు తెలిపిందని, కానీ కరోనా మహమ్మారి, ప్రస్తుత పరిమాణాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉపసంహరించుకుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇతరప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో సర్వీస్ ఛార్జీలలో మార్పులు చేయలేదని తెలిపింది.
ఛార్జీలు పెంచకూడదని సూచించాం
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తాము అందిస్తోన్న సేవలకు పారదర్శకత, సమంజసమైన రీతిలో విచక్షణతో ఛార్జీలను విధించేందుకు అనుమతి ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిణామాల కారణంగా సమీప భవిష్యత్తులో ఛార్జీలు పెంచకూడదని PSBలకు తెలియజేశామని ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో కరోనా ప్రతికూల సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని వెల్లడించింది.
వెనక్కి తీసుకున్న బీవోబీ
60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదని, 41.13 కోట్ల జన్ ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు బ్యాంకు శాఖకు వచ్చి నగదును మూడుసార్లకు మించి డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా ఛార్జీలు విధిస్తున్నామని, నాలుగోసారి నుండి నగదు డిపాజిట్ చేయడానికి ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.40 నుండి రూ.50 మధ్య ఛార్జీ వసూలు చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత వెనక్కి తీసుకుంది.