ప్రాఫిట్ బుకింగ్, జీడీపీ డేటా: మూడ్రోజుల లాభాలకు బ్రేక్
నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు (మే 31, మంగళవారం) తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్లో అయితే సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ప్రారంభం నుండి సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఏ దశలోను లాభాల్లోకి రాలేదు. పైగా అంతకంతకూ నష్టపోయిన సెన్సెక్స్, ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల నష్టాల్లో కనిపించింది. చివరకు 360 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.
ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు నేడు రోజుంతా అదే ఒరవడిని కొనసాగించాయి. కనిష్టాల నుండి కోలుకొని నిన్నటి ముగింపు స్థాయికి వచ్చినప్పటికీ చివరి అరగంటలో మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రష్యా చమురు దిగుమతులపై ఐరోపా ఆంక్షలు విధించడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. దీనికి తోడు నిన్నటి భారీ ర్యాలీ కారణంగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అలాగే, నాలుగో త్రైమాసికం జీడపీ డేటా నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 55,622 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,925 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,369 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 359.33 పాయింట్లు క్షీణించి 55,566 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76.85 పాయింట్లు నష్టపోయి 16,584.55 పాయింట్ల వద్ద ముగిసింది. భారీ అంచనాలతో ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ షేర్ వ్యాల్యూ ప్రస్తుతం రూ.810.85 వద్ద ఉంది. నేడు 3.21 శాతం క్షీణించింది.