భారీ లాభాల్లో మార్కెట్లు, 250 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్, 52 వారాల గరిష్టానికి ఆ స్టాక్స్
ముంబై: అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గురువారం దూసుకెళ్లిన మార్కెట్లు, శుక్రవారం (జనవరి 10) కూడా భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 159.56 పాయింట్లు లేదా 0.38 శాతం ఎగిసి 41,611.91 వద్ద ఉంది. నిఫ్టీ 45.50 పాయింట్లు లేదా 0.37శాతం పెరిగి 12,261.40 వద్ద ఉంది. మధ్యాహ్నం గం.11.24 నిమిషాలకు సెన్సెక్స్ 247.39 (0.60%) పాయింట్లు ఎగిసి 41,699.74 వద్ద, నిఫ్టీ 70.60 (0.58%) పాయింట్లు పెరిగి 12,286.50 వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం పదకొండున్నర సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, గెయిల్, వేదాంత, ఎస్బీఐ, భారతీ ఇన్ఫ్రాటెల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.
వాహన రంగంపై బంద్ ఏ మేరకు అంటే, నిలిచిపోయిన ఉత్పత్తి
ఐటీ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, టాటా ఈఎల్ఎక్స్సీఐ, విప్రో, టీసీఎస్ షేర్లు 0.9 శాతం నుంచి 0.85 శాతం వరకు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా గ్లోబల్ బీవరేజెస్, యునైటెడ్ బీవరేజెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్, మారికో ఒక శాతం నుంచి మూడున్నర శాతం వరకు ఎగిశాయి. టాటా గ్లోబల్ బీవరేజెస్, ఎస్ఆర్ఎఫ్, వెల్స్పన్, డాక్టర్ రెడ్డీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సహా 35 స్టాక్స్ ఈ రోజు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు, సైరస్ మిస్త్రీని పునర్నియమించాలని NCLAT ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్, టీసీఎస్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది.