ప్రపంచ ఈక్విటీ ర్యాలీకి అదే ముప్పు.. అందుకే భారత మార్కెట్ల భారీ పతనం
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి. ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వరుసగా మూడో రోజు నష్టపోవడంతో సెన్సెక్స్ అరవై వేల పాయింట్ల దిగువకు, నిఫ్టీ 18000 పాయింట్ల దిగువకు పడిపోయింది.
బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, పార్మా, రియాల్టీ రంగాలు ఒక శాతం నుండి రెండు శాతం మేర నష్టపోయాయి. కేవలం మెటల్ సూచీ మాత్రమే లాభాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి.
అందుకే పతనం
ద్రవ్యోల్భణ భయాలు ఆసియా స్టాక్స్తో పాటు భారత్ స్టాక్స్ను ఒత్తిడికి గురి చేశాయి. 1990 నుండి చూస్తే గత నెలలో యూఎస్ కన్స్యూమర ధరలు అత్యంత వేగంగా పెరిగినట్లు డేటా చూపించడంతో ఈ రోజు డాలర్ పైన ప్రభావం చూపింది. ఇది ఫెడ్ రిజర్వ్ పాలసీని మరింత కఠినతరం చేయడానికి దోహదపడుతుంది. యూఎస్ ట్రెజరీ దిగుబడులు అధికస్థాయికి చేరుకున్నాయి. బెంచ్ మార్క్ టెన్ ఇయర్ నోట్ ఫిబ్రవరి నుండి చూస్తే అత్యధికంగా దూసుకుపోయింది.
పెరుగుతున్న ద్రవ్యోల్భణం కనీసం స్వల్పకాలిక కాలమైనా ప్రపంచ ఈక్విటీ ర్యాలీకి ముప్పుగా పరిణిస్తోందని, అమెరికాలో వినియోగదారుల ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో ముప్పై సంవత్సరాల గరిష్టస్థాయి 6.2 శాతానికి పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. ప్రధాన ద్రవ్యోల్భణం 4.2 శాతానికి పెరిగిందని చెప్పారు.
ఈ సంఖ్యలు అంచనాల కంటే ఎక్కువగా ఉన్నాయి. చైనాలో కూడా ప్రొడ్యూసర్ ధరల ద్రవ్యోల్భణం 13.5 శాతానికి పెరిగింది. ఇది గ్లోబల్ కమోడిటీ ద్రవ్యోల్భణానికి దారితీసే అవకాశం ఉందని చెప్పారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం జూన్ చివరి నాటికి ఫెడ్ రేట్లు పెంచే అవకాశముందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
సెన్సెక్స్ 445 పాయింట్లు పతనం
సెన్సెక్స్ నేడు 60,291.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,293.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,656.26 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 433.13 (0.72%) పాయింట్లు నష్టపోయి 59,919.69 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,967.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,971.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,798.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 130.50 (0.72%) పాయింట్లు లాభపడి 17,886.70 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సన్, రిలయన్స్, SBI ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 1.75 శాతం, హిండాల్కో 0.93 శాతం, JSW స్టీల్ 0.75 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.55 శాతం, రిలయన్స్ 0.18 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో IOC 4.41 శాతం, టెక్ మహీంద్రా 2.85 శాతం, SBI 2.82 శాతం, ONGC 2.66 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 2.58 శాతం నష్టపోయాయి.