భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, చివరి గంటలో అమ్మకాల వెల్లువ
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు ఏ దశలోను పూర్తిగా లాభాల్లోకి రాలేదు. మధ్యలో కాసేపు ఒకటిరెండుసార్లు లాభాల్లోకి వచ్చినప్పటికీ వెంటనే నష్టపోయింది. రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా సూచీలు ప్రతికూలంగా ముగియడం సూచీలపై ప్రభావం చూపింది. అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలు ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పైగా దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో సూచీలకు ఏ దశలోనూ మద్దతు లభించలేదు.
ఉదయం 60,179.93 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 60,426.61 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,944.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,939.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,022.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,879.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 314.04 (0.52%) పాయింట్లు నష్టపోయి 60,008.33 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.55 (0.56%) పాయింట్లు నష్టపోయి 17,898.65 పాయింట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్, HDFC జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు దిగ్గజ షేర్లు నష్టపోవడం సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.2 శాతం నష్టపోగా, స్మాల్ క్యూప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.