రోజంతా ఊగిసలాట.. నష్టాల నుండి భారీ నష్టాల్లోకి: సెన్సెక్స్ 282 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(జూన్ 23) లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ, చివరి గంటలో అంతకంతకూ పతనమైంది. రోజంతా నష్టాల్లోనే ఊగిసలాడి చివరకు 280 పాయింట్లుకు పైగా క్షీణించి క్లోజ్ అయింది సెన్సెక్స్. నిఫ్టీ 15,700 దిగువన ముగిసింది. చివరలో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో పూర్తిగా నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా సూచీలు గరిష్ఠస్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపారు.
ఆటో రంగంలో లభించిన కొనుగోళ్ల మద్దతు ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో ఆవిరి కావడం నష్టాలకు కారణంగా మారింది. చివరకు సెన్సెక్స్ 282.63 (0.54%) పాయింట్లు నష్టపోయి 52,306.08 వద్ద, నిఫ్టీ 85.80 (0.54%) పాయింట్లు నష్టపోయి 15,686.95 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.24 వద్ద నిలిచింది.
నేటి టాగ్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.30 శాతం, టైటాన్ కంపెనీ 1.45 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.24 శాతం, ఓఎన్జీసీ 1.07 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.87 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.26 శాతం, విప్రో 2.95 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.50 శాతం, JSW స్టీల్ 1.44 శాతం, లార్సన్ 1.33 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.