భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, రూపాయి మరింత పతనం
వరుస నష్టాల నుండి 2 రోజులపాటు బ్రేక్ తీసుకున్న స్టాక్ మార్కెట్లు నేడు మళ్లీ పతనమయ్యాయి. మంగళవారం భారీగా లాభపడిన సూచీలు బుధవారం ఆ లాభాలను ఆవిరి చేశాయి. ఆరంభంలో ప్రతికూలంగా ట్రేడింగ్ మొదలుపెట్టిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. నిన్నటి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం సూచీల పతనానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్ నష్టాలకు కారణాలు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు పెంపు, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఆర్థిక మాంద్యం భయాల్లో చిక్కుకున్న మార్కెట్లకు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా లేదు. దీంతో కొద్ది రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 52,186 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,272 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,739 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 709 పాయింట్లు లేదా 1.35 శాతం క్షీణించి 51,822 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,545 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,565 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,386 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 225 పాయింట్లు క్షీణించి 15,413 పాయింట్ల వద్ద ముగిసింది.
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. మెటల్ సూచీ అయితే ఏకంగా 5 శాతానికి పైగా క్షీణించింది. ఇదిలా ఉండగా, అమెరికా డాలర్తో భారత కరెన్సీ రూపాయి నేడు క్షీణించింది. బుధవారం ట్రేడింగ్లో 78.40తో రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. క్రితం సెషన్లో రూపాయి 78.13 వద్ద ముగిసింది. అంటే నేటు 27 పైసలు క్షీణించింది.