లాభాల్లోకి వచ్చిన మార్కెట్లు: ఈ డిప్ సమయంలో ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు!
స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 23) లాభాల్లో ముగిశాయి. నిన్న భారీగా పతనమైన సూచీలు ఈరోజు పట్టు నిలుపుకున్నాయి. నేడు ప్రారంభ సెషన్లో 350 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఆ తర్వాత అంతకంతకూ లాభపడి, దాదాపు రెండు వందల పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. అంటే ఉదయం సమయానికి రెండు ట్రేడింగ్ సెషన్లలోనే 1900 పాయింట్లకు పైగా దిద్దుబాటుకు గురయినప్పటికీ మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్భణ భయాల నేపథ్యంలో ఇటీవలి కనిష్టాలకు పడిపోవడంతో ఈ డిప్ వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ప్రధానంగా డిప్ వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అలాగే, లిస్టింగ్ నుండి నష్టాలను నమోదు చేస్తున్న పేటీఎం, ఫినో పేమెంట్స్ షేర్లు లాభపడ్డాయి.
లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు 57,983.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,718.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 198.44 (0.34%) పాయింట్లు లాభపడి 58,664.33 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,281.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,553.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,216.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 86.80 (0.50%) పాయింట్లు లాభపడి 17,503.35 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
లాభపడిన ఎయిర్టెల్
సెన్సెక్స్ 30 సూచీలో 21 షేర్లు లాభపడ్డాయి. రాణించిన వాటిలో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, HDFC, టీసీఎస్ షేర్లు రాణించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, మారుతీ, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోయాయి.
ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు
పది నిఫ్టీ స్టాక్స్ ఇటీవలి గరిష్టాల నుండి ఇరవై శాతం నష్టపోయాయి. ఐతే పలు స్టాక్స్ను కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హీరో మోటో కార్ప్ షేర్ ధర ప్రస్తుతం రూ.2633 వద్ద ఉంది. ఇది 52 వారాల గరిష్టం రూ.3629తో పోలిస్తే 28 శాతం డౌన్. దీని టార్గెట్ ధరను రూ.3157గా చెబుతున్నారు. అంటే 20 శాతం పెరుగుదల నమోదవుతుందని అంచనా. కోల్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రూ.156.50గా ఉంది. దీని టార్గెట్ ధరను రూ.203గా పేర్కొంటున్నారు. అంటే ఇది 27 శాతం అధికం. వీటితో పాటు యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంకు, HCL టెక్ కూడా ఇరవై శాతం నుండి 22 శాతం మేర రిటర్న్స్ ఇస్తాయని అంచనా. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కాస్త రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.