మూడ్రోజుల నష్టాలకు బ్రేక్, భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు (మే 26, గురువారం) లాభాల్లోకి వచ్చాయి. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. దీంతో సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఉదయం లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, మధ్యాహ్నం గం.1 తర్వాత లాభాల్లోకి వచ్చింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పైగా అంతకంతకూ ఎగిసిపడింది.
సెన్సెక్స్ ఉదయం 53,950 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,346 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,425 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 503 పాయింట్లు లాభపడి 54,252 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,105 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,204 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,903 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 144 పాయింట్లు ఎగిసి 16,170 పాయింట్ల వద్ద ముగిసింది.
మెటల్, ఐటీ, పవర్, రియాల్టీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 1 శాతం నుండి 3 శాతం మేర లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యు స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, HDFC బ్యాంకు ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, యూపీఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, రిలయన్స్ ఉన్నాయి.